ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్కు ఎట్టకేలకు తెర పడింది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం సీఎం చంద్రబాబు ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తనవద్దనే ఉంచుకున్నారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అను గుణంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితోపాటు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను ఇచ్చారు. అలాగే పర్యావరణ, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్కే దక్కాయి. నారా లోకేశ్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖను అప్పగించారు.
వంగలపూడి అనితకు హోం శాఖ, విపత్తు నిర్వహణ, అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డెయిరీ, మత్స్యశాఖ ఇచ్చారు. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్, గనులు, నాదెండ్ల మనోహర్కు ఆహార, పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖను అప్పగించారు. సత్యకుమార్ యాదవ్కు వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ, నిమ్మల రామానాయుడు- జల వనరుల అభివృద్ధి శాఖ కేటాయించారు.
ఆనం రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖ, మహ్మద్ ఫరూఖ్కు న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమం, అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ ఇచ్చారు. ఇక, ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు శాఖను పయ్యావుల కేశవ్కు అప్పగించారు. గొట్టిపాటి రవికుమార్- విద్యుత్ శాఖ, కందుల దుర్గేశ్- టూరిజం, సాంస్కృతి శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ, గుమ్మిడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖలు ఇచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎస్.సవిత- బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీనవర్గాల సంక్షేమం, చేనేత, టెక్స్ టైల్స్ శాఖ ఇచ్చారు. వాసంశెట్టి సుభాష్ కి కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్- సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు శాఖను అప్పగించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి- రవాణా, క్రీడల శాఖను ఇచ్చారు.