ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా?. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఒకప్పుడు సన్నిహితుడు, వైసీపీలో జగన్ తర్వాత కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యిందా ? అంటే కూటమి వర్గాల్లో అవును అనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల కిందట ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి కూడా రిజైన్ చేశారు. ఇదే సమయంలో ఇకపై తాను రాజకీయాల్లో కొనసాగనని.. ఇక ముందు వ్యవసాయం చేసుకుంటానని కూడా స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయి.
జగన్ తర్వాత అంత కీలకంగా ఉన్న నేత.. ఎందుకు పార్టీని వీడారు. నిజంగానే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా ? .. ఇలాంటి ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలియజేసే విధంగా వ్యవసాయ క్షేత్రంలో దిగిన ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్వాగత కార్యక్రమంలో కనిపించడంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
ఉప రాష్ట్రపతి కూడా సిట్టింగ్ ఎంపీల కంటే ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో విజయసాయి మళ్లీ కాస్త గ్యాప్తో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. విజయసాయి ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారని..ఆయన జూన్ లేదా జులైలో బీజేపీలో చేరతారని..అక్కడ కూడా ఆయన కీలకంగా వ్యవహరించబోతున్నారని కూటమి వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే ముందు నుంచి చెబుతున్నట్టుగా ఆయన ఓ ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానెల్ను ప్రారంభిస్తారని అంటున్నారు. విజయసాయిరెడ్డికి జనంలో పెద్దగా పాపులారిటీ లేకపోయినా.. తెర వెనుక వ్యూహాలు రచించడంతో దిట్ట. విజయసాయి బీజేపీలో చేరే అంశంపై ఇప్పటికే కూటమి పెద్దలకు కూడా సమాచారం తెలుసట. ఎలాగైనా సరే జగన్ను వీక్ చేయడమే తమకు కూడా కావాల్సిందనే ఆలోచనలో ఉన్నారట కూటమి నేతలు.