స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ‘ప్రేమ’ అన్న పదాన్ని సరిగా అర్ధం చేసుకొని యువత అడ్డదారులు తొక్కుతున్నారు. కామం, స్వార్థాన్నే ప్రేమగా భావించి యోగ్యత లేని అసమర్థున్ని ప్రేమించి జీవితాలను అభాసుపాలు చేసుకుంటున్నారు. నిజానికి ప్రేమ ఎప్పుడూ… ప్రేమించిన వారి సంతోషాన్ని కోరుకుంటుంది.. పంతాన్ని కాదు. ఇది అర్ధం చేసుకోలేని యువత కేవలం బాహ్య సౌందర్యానికి లోనై.. ఆంతర సౌందర్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఫలితంగా ప్రేమించిన వారి చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.
తాజాగా మరో ఘటనే హృదయాల్ని కలిచివేస్తుంది. కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. ఉరితాడుకు బలయ్యింది. ఇప్పటికే పెళ్లయిన ఓ యువకుడు వేధించడం, అంతేకాకుండా తనకు కుదిరిన పెళ్లిని చెడగొట్టడంతో మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో ఈ విషాదకర సంఘటన జరిగింది.
ఎస్సై కోన వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. బైరంపల్లికి చెందిన లక్ష్మయ్య కుమార్తె అనూష (22) డిగ్రీ చదివింది. అనంతరం ఇంటి వద్దనే ఉంటోంది. ఆమె తల్లి చాలాకాలం క్రితమే మరణించింది. చాలారోజుల తరువాత ఆమెకు ఇటీవలే ఓ కానిస్టేబుల్తో నిశ్చితార్థం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్… ఆ కానిస్టేబుల్కు ఫోన్చేసి గట్టిగా మాట్లాడాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీయడంతో నిశ్చయమైన వివాహం కాస్తా ఆగిపోయింది. అయితే శ్రీకాంత్ కు పెళ్లయి, ఒక కుమారుడు ఉన్నాడు. వివాహం ఆగిపోవడంతో మనస్తాపం చెందిన యువతి శుక్రవారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుంది. తెల్లవారి కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూసే సరికి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. అనూష మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, మృతిరాలి సోదరుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.