ఇటీవలికాలంలో పర్యాటకరంగం బహుముఖాలుగా విస్తరించింది. హెల్త్ టూరిజం, ఎడ్యుకేషనల్ టూరిజం, ఆగ్రో టూరిజం ఇవన్నీ తెరమీదకు వచ్చాయి.ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎన్ని సిరిసంపదలు ఉన్నా, ఆరోగ్యం లేకుంటే వృధాయే. ఆరోగ్యంపై ప్రజల ఆలోచనాధోరణి మారింది. వ్యాధులు వస్తే, వెంటనే చికిత్సల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అవసరమైతే విదేశాలకు కూడా వెళుతున్నారు. దీనినే హెల్త్ టూరిజం అంటున్నారు.
ఇటీవలికాలంలో మనదేశం..హెల్త్ టూరిజానికి హబ్గా మారింది. భారత్తో పోలిస్తే అనేక దేశాల్లో వైద్యానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. సామాన్య ప్రజలు ఈ ఖర్చును భరించలేరు. మధ్యతరగతి ప్రజలకు ఇది భరించలేని ఖర్చే. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు బాగా తక్కువ. దీంతో, అనేక దేశాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం భారత్కు వస్తున్నారు. ఇలా వచ్చే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ముఖ్యంగా కేరళలోని పంచకర్మ ఆయుర్వేద చికిత్స కోసం విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇదిలా ఉంటే విదేశీ క్లయింట్లను ఆకట్టుకోవడానికి మనదేశంలోని పేరొందిన వైద్య సంస్థలు అనేక ప్యాకేజీలను సిద్ధం చేశాయి. సంపన్నులకు ఒక రేటు, మధ్యతరగతికి ఒక రేటు, పేదలకు మరో రేటు… అంటూ చికిత్స ఖర్చును ఫిక్స్ చేశాయి. అయితే చికిత్స విషయంలో రవ్వంత కూడా రాజీ పడటం లేదు వైద్యసంస్థలు.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే రోగుల భరోసాను భారత్ వైద్య సంస్థలు నిలబెట్టుకుంటున్నాయి. రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో చికిత్స అందచేస్తూ రోగుల మనసు దోచుకుంటున్నాయి భారత్ వైద్య సంస్థలు. ఎడ్యుకేషనల్ టూరిజం, ఇదో కొత్త తరహా పర్యాటకరంగం. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా ఎంఎస్ కోర్సులు చేయడానికి మన దేశం నుంచి ప్రతి ఏడాది అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలకు పెద్ద సంఖ్యలో యువతీయువకులు వెళుతున్నారు. అలాగే వైద్య విద్య చదవడం కోసం ఉక్రెయిన్ సహా అనేక దేశాలకు వెళ్లడం కొంతకాలంగా పెరిగింది.
ఇటీవలికాలంలో తెరమీదకు వచ్చిన మరో పేరు… ఆగ్రో టూరిజం. ఇది మౌలికంగా వ్యవసాయ ఆధారిత పర్యాటకం. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఆగ్రో టూరిజం ప్రధానోద్దేశం. ఆగ్రో టూరిజం వల్ల ఒక్క అన్నదాతల బతుకులు బాగపడటమే కాదు, గ్రామీణ భారతదేశానికి కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఆగ్రో టూరిజం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. వ్యవసాయ పర్యాటకం మొదటగా అమెరికాలో వాడుకలోకి వచ్చింది. మనదేశంలో మహారాష్ట్రలోని బారామతిలో వ్యవసాయ పర్యాటక అభివృద్ధి పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. బారామతిలోని సంస్థే, మనదేశంలో ఆగ్రో టూరిజానికి నాంది పలికింది.మనదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ పర్యాటకం కీలకంగా మారింది. ఆగ్రో టూరిజం ద్వారా వచ్చే ఆదాయం ఏడాది కేడాది ఇరవై శాతం పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలను పర్యాట కంతో జోడిస్తున్నారు. దీంతో స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది భారతదేశం. పర్యాట కరంగానికి పర్యావరణం జీవంలాంటిది.
పర్యావరణం అభివృద్ది కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా అంతిమంగా అవి పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఉండకూడదంటున్నారు నిపుణులు. పర్యాటక ప్రాంతాలను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచ డానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విదేశీ పర్యాటకుల భద్రతకు గట్టి హామీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. దీంతోపాటు మారుమూల ప్రాంతాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలు, అలాగే నిరాదరణకు గురైన టూరిజం ప్రదేశాలను కూడా ప్రభుత్వాలు గుర్తించాలి. సదరు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. పర్యాటక ప్రాంతాలన్నిటినీ రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానించాలి. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పర్యాటకు లకు అందుబాటులో ఉండేలా చూడాలి. ఈ చర్యల వల్ల దేశీయ పర్యాటకరంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.