స్వతంత్ర వెబ్ డెస్క్: పరువు గల కుటుంబమని వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టొద్దని ఓ అన్న తన చెల్లిని హెచ్చరించాడు. అయినా మాట వినకుండా వీడియోలు చేస్తుండడంతో ఆగ్రహించి రోకలితో కొట్టి హతమార్చాడు. యూట్యూబ్ షార్ట్ వీడియోలు చేస్తూ దానికి బానిసైన చెల్లిని క్షణికావేశంలో హతమార్చాడో అన్న. తమది పరువుగల కుటుంబమని వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి తమను బజారుకీడ్చొద్దని చెల్లిని హెచ్చరించాడు. అయినా చెల్లెలు తన మాట వినకుండా వీడియోలు చేస్తుండడంతో ఆగ్రహించిన అన్న విచక్షణ కోల్పోయి చంపేశాడు. ఇంట్లో ఉన్న రోకలి తీసుకుని చెల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన చెల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. ఈ ఘోరమైన ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఈ ఘటన జరిగింది.
రాజీవ్నగర్ తండాకు చెందిన అజ్మీరా శంకర్, దేవీకు అమ్మాయి అజ్మీరా సింధు (20), అజ్మీరా హరిలాల్ సంతానం. సింధు మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పని చేస్తోంది. హరిలాల్ పనులకు వెళ్లేవాడు. తండ్రి అజ్మీరా శంకర్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి అజ్మీరా దేవి కూలీ పనులకు వెళుతోంది. నర్సుగా పనిచేస్తూనే సింధు సరదాగా యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తోంది. ఇది అన్న హరిలాల్కు నచ్చలేదు.
యూట్యూబ్లో వీడియోలు చేయొద్దని, తమది పరువు గల కుటుంబమని ఇంటి పరువు తీయొద్దని సూచించాడు. పలు మార్లు హెచ్చరించాడు. అయినా సింధు తన సోదరుడి మాటలు పట్టించుకోకుండా పోస్టు చేస్తోంది. ఈ విషయంలో సింధు, హరిలాల్ కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. తల్లి వీరిని వారిస్తూ వచ్చింది. అన్న చెల్లెల్లు గొడవ పడొద్దని చెబుతూ వచ్చింది. అంతలోనే ఈ ఘోరం జరిగింది.
ఇదే విషయంపై గత సోమవారం కూడా ఇంట్లో సింధు, హరిలాల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. యూట్యూబ్లో పోస్టు చేసిన వీడియోలన్నీ డిలీట్ చేయాలని, ఇకపై వీడియోలు చేయవద్దని హరిలాల్ సింధును హెచ్చరించాడు. ఇందుకు సింధు అంగీకరించలేదు. కోపోద్రిక్తుడైన హరిలాల్ ఇంట్లో ఉన్న రోకలిబండతో సింధు తలపై కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబసభ్యులు తొలుత ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి, తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సింధు మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.