స్వతంత్ర, వెబ్ డెస్క్: జనసేన పార్టీలో ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో బీవీఎస్ఎన్ జనసేన తీర్థం పుచ్చుకొన్నారు. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్. అప్పట్లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈయన వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ద్వారా సినిమాలు తీశారు. బీవీఎస్ఎన్ పార్టీ చేరిక అనంతరం తెలంగాణ జనసేన నాయకులతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 26 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే జనసేన లక్ష్యమని అన్నారు. తెలంగాణ కోసం 1,300 మంది అమరులయ్యారని గుర్తుచేశారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు మనం నడుం బిగించాలని అన్నారు. ఏ పార్టీ ఇంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వలేదన్న పవన్.. జనసేన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.