ఏడుస్తూ, కేకలు వేస్తున్న ఓ యువతిని ఓ వ్యక్తి బంజరు భూముల మీదుగా ఎత్తుకెళ్తున్నాడు. మరో వ్యక్తి, మహిళ వారిని అనుసరిస్తున్నారు. యువతికి సాయం చేసేందుకు వారెలాంటి ప్రయత్నాలు చేయలేదు. కర్ణాటక హోసూర్కు చెందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు.
ఈ 14 ఏళ్ల బాలిక తమిళనాడులోని హోసూర్ సమీపంలోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ అనే చిన్న గ్రామానికి చెందినది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో తరచూ జరిగే విధంగా.. ఆమె కూడా స్థానిక పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన తర్వాత ఇంట్లోనే ఉండేది.
కానీ మార్చి 3న, ఆమె కుటుంబం ఆమెను కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన 29 ఏళ్ల కూలీ మాదేష్తో వివాహం చేసింది. పెళ్లి ఇష్టం లేదని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. బెంగళూరులో ఈ వివాహం జరిగింది.
తన స్వస్థలం తిమ్మత్తూరుకు తిరిగి వచ్చిన తర్వాత, ఆ అమ్మాయి పెళ్లి ఇష్టం లేదని కుటుంబ సభ్యులకు చెప్పింది. తన అత్తమామల ఇంటికి వెళ్లడానికి నిరాకరించింది. ఆమె తల్లిదండ్రులు, బంధువులకు కూడా తన నిరసనలను తెలియజేసింది.
మాదేష్ , అతని అన్నయ్య మల్లేష్ కలిసి ఆ యువతిని బంధువుల ఇంటి నుండి కాలికుట్టై గ్రామానికి బలవంతంగా తీసుకెళ్లారు. ఇది చూసిన స్థానికులు సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అది వైరల్ అయింది.
డెంకనికోట్టైలోని ఆల్-ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. బాలిక అమ్మమ్మ అధికారిక ఫిర్యాదు చేసింది. బుధవారం మాదేశ్, అతని అన్నయ్య మల్లేశ్,. బాలిక తల్లి నాగమ్మను అరెస్టు చేశారు. ఇవాళ బాలిక తండ్రి, మల్లేశ్ భార్యను అరెస్టు చేశారు.
వారందరిపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం) , బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారందరికీ రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలిక.. అమ్మమ్మ, తాతయ్యతో ఉంటోంది.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల వివాహం చట్టవిరుద్ధం , బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం అది చెల్లదు.
2023-2024లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, కర్ణాటకలో 180 బాల్య వివాహాల గురించి అధికారులకు సమాచారం అందింది. అలాగే 105 వివాహాలను అడ్డుకున్నారు. మిగిలిన 75 సందర్భాలలో పోలీసు కేసులు నమోదయ్యాయి.