అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాగ్వాదం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇద్దరూ మీడియా ముందే గొడవ పడడం సంచలనం సృష్టించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలపై సందేహాలను వ్యక్తం చేసింది. ఈ అనూహ్య పరిణామం అనంతరం యూరోపియన్ దేశాధినేతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి తమ మద్దతు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సాయం చేసినందుకు కృతజ్ఞతతో లేరని బహిరంగంగా తిట్టిపోశారు. తరువాత ఉక్రేనియన్ అధ్యక్షుడు శాంతికి సిద్దంగా లేరని.. ప్రతిష్టాత్మకమైన ఓవల్ ఆఫీసులో యునైటెడ్ స్టేట్స్ను అగౌరవపరిచారని ఆరోపించారు.
ఈయూ ఏమందంటే..
యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లేయన్ , ఆంటోనియో కోస్టా జెలెన్స్కీ ఎప్పుడూ ఒంటరి కాదని.. తామున్నామని హామీ ఇచ్చారు.
“ధైర్యంగా ఉండండి, నిర్భయంగా ఉండండి” అని యూరోపియన్ కమిషన్ , కౌన్సిల్ అధ్యక్షులు సోషల్ మీడియాలో సంయుక్త ప్రకటన చేవారు. “న్యాయమైన, శాశ్వత శాంతి కోసం మేము మీతో కలిసి పని చేస్తూనే ఉంటాము.”
ఫ్రాన్స్ స్పందన
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా “దురాక్రమణదారుడు” అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు.
“రష్యా అనే దురాక్రమణదారుడు ఉన్నాడు.” అని మాక్రాన్ విలేకరులతో అన్నార., “మూడు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్కు సహాయం చేసి, రష్యాకు ఆంక్షలు విధించి మంచి పనిచేశాం.”
జెలెన్స్కీపై ట్రంప్ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, “ఎవరైనా మూడవ ప్రపంచ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారంటే, అది వ్లాదిమిర్ పుతిన్” అని అన్నారు.
జర్మనీ
జర్మనీ తదుపరి ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న ఫ్రెడరిక్ మెర్జ్, ఎక్స్లోలో జెలెన్ స్కీకి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
“ఈ భయంకరమైన యుద్ధంలో దురాక్రమణదారుడిని , బాధితుడిని మనం ఎప్పుడూ గందరగోళానికి గురిచేయకూడదు” అని మెర్జ్ అన్నారు. పదవీ విరమణ చేసిన ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ కూడా ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించారు. విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్బాక్ కూడా ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించారు.
హంగేరీ
ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరికీ అత్యంత సన్నిహిత భాగస్వాములలో ఒకరైన హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ మాట్లాడుతూ.. శాంతి కోసం ధైర్యంగా నిలబడినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు.
“బలవంతులు శాంతిని నెలకొల్పుతారు.. బలహీనులు యుద్ధం చేస్తారు” అని ఓర్బన్ ఎక్స్ లో ఒక పోస్ట్లో రాశారు.
ఇటలీ
ఉక్రెయిన్ యుద్ధంపై ఆలస్యం లేకుండా అమెరికా, యూరప్ వారి మిత్రదేశాలు సమావేశమవ్వాలని ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పిలుపునిచ్చారు.
నెదర్లాండ్స్
“ఉక్రెయిన్కు డచ్ మద్దతు తగ్గలేదు. ముఖ్యంగా ఇప్పుడు,” అని ప్రధాన మంత్రి డిక్ స్కూఫ్ ఎక్స్ లో అన్నారు, “మేము శాశ్వత శాంతిని ,రష్యా ప్రారంభించిన యుద్ధానికి ముగింపును కోరుకుంటున్నాము” అని అన్నారు.
పోలాండ్
ఉక్రెయిన్ ప్రజలు ఒంటిరి వారు కాదని.. తమ మద్దతు ఉంటుందని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఎక్స్లో పోస్టు చేశారు.
స్పెయిన్
యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్కు తమ దేశం అండగా నిలుస్తుందని స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ అన్నారు.
రష్యా
అమెరికా, ఉక్రెయిన్ వాడీవేడి చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడుతూ.. ” అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్ కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బ. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందే” అని అన్నారు. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా స్పందిస్తూ.. “ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారు. తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారు. ఆయనపై దాడి చేయకుండా ట్రంప్ , జేడీవాన్స్ సంయమనం పాటించడం అద్భుతమే” అని దుయ్యబట్టారు.