కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందా? ఏకంగా మంత్రే తమ వ్యాపారాలను అడ్డుకుంటున్నాడని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి.. అదే జిల్లాకు చెందిన నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయట. నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ కొన్ని కంకర క్రషింగ్ యూనిట్లను మూసి వేయించడమే ఈ గొడవంతటికీ కారణమయ్యిందట. తమ అనుమతి లేకుండా ఎలా క్రషర్లు మూయిస్తారని ఎమ్మెల్యేలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిబంధనల మేరకే తాము సీజ్ చేశామని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.
ఇటీవల ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన మంత్రిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుర్రుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా మంత్రిని వారు విభేదిస్తున్నారట. సమయం వచ్చినప్పుడల్లా మంత్రికి చెక్ పెట్టేందుకు ఆ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారట. గతంలో కూడా అదే మంత్రికి వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా పరిష్కారం లభించకపోవడంతో ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్దపడ్డారట. తాము మంత్రి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని.. అందుకే హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారట. అయితే సీనియర్లు జోక్యం చేసుకోవడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా క్రషింగ్ యూనిట్లను మంత్రే మూయించారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ నియోజకవర్గాల్లో ఉన్న క్రషింగ్ యూనిట్లను మూసేయించడం అంటే.. నేరుగా తమ నియోజకవర్గ విషయాల్లో జోక్యం చేసుకోవడమే అని సదరు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారట. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా మూసేయించడం వెనుక మంత్రి హస్తం ఉందని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే.. భవిష్యత్లో మంత్రి మరింతగా రెచ్చిపోతారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. అందుకే క్రషింగ్ యూనిట్ల వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. రేపో మాపో సదరు ఎమ్మెల్యేలందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి వ్యవహారాన్ని వివరించాలని భావిస్తున్నారట.
గతంలో ఉత్తర తెలంగాణలోని ఒక కీలక ఉమ్మడి జిల్లాలో మెజార్టీ క్రషింగ్ యూనిట్లు బీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉండేవి. గులాబీ నాయకుల అనుచరులే ఈ క్రషింగ్ యూనిట్లను నిర్వహించారు. అప్పట్లో ఆ యూనిట్ల జోలికి వెళ్లడానికి ఏ అధికారి కూడా సాహసించే వారు కాదు. పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కనీసం అటు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక క్రషింగ్ యూనిట్లను పీసీబీ మూసేయించింది.. కొన్నింటికి నోటీసులు జారీ చేసింది. దీన్నే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా మూసేయిస్తారని.. దీని వెనుక మంత్రి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. అయితే గులాబీ నాయకులతో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యారని.. అందుకే వారి క్రషింగ్ యూనిట్లకు వత్తాసు పలుకుతున్నారని మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు.
కేవలం మంత్రి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక క్రషింగ్ యూనిట్లపై అధికారులు దాడులు చేసి మూసేయించారని.. కానీ ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి తీరును తప్పుబట్టడం సరికాదని అంటున్నారు. గులాబీ పార్టీ నాయకులతో ఎలా కుమ్మక్కయ్యారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో మంత్రిని తప్పుబడితే చూస్తూ ఊరుకోమని మంత్రి అనుచరులు హెచ్చరిస్తున్నారట. మరోవైపు ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. త్వరలోనే వారు సీఎంను కలుస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ వ్యవహారంలో సీఎం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.