మెదక్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గోవధ చేసేందుకు ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మెదక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి బాల స్వామి తెలిపారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినం దున దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. ఆవుల రవాణాను బీజేవైఎం నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఫిర్యాదు చేయ కుండా నిరసనకు దిగారు. కొట్లాటలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాలు రోడ్డు పై బైఠాయించి నిరసనకు దిగారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిపై కూడా దాడి జరిగింది.
మెదక్ పట్టణంలో శనివారం రాత్రి 7 గంటలకు రెండు వర్గాల మధ్య గొడవకు జరిగింది. గోవధను నిషేధించాలని ఓ వర్గం వారు నిన్న మధ్యాహ్నం పట్టణంలో ఆందోళనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద గోవులు కనిపించడంతో ఓ వర్గం వారి కోసం వధించేందుకు తెచ్చారని మరో వర్గం వారు పోలీసులకు సమాచారం అందించారు. నర్సిఖేడ్లో ఇంకొన్ని ఆవులున్నాయని పోలీసులకు తెలపడంతో సీఐ అక్కడికి వెళ్తుండగా, ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరోవర్గం యువకుడి పై కత్తితో దాడిచేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగారు.