ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి సంబంధించి ఇటీవల కొన్ని కీలక పరిణామాలు సంభవించాయి. గత ఎనిమిది నెలలగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి తెరదించడానికి కొన్ని ఐరోపా దేశాలు చొరవ చూపాయి.
మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పడంలో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఐరోపా దేశాలు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ గుర్తించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు నార్వే ప్రధానమంత్రి జోనాస్ గర్స్టోర్ ఇటీవల ప్రకటించారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించకపోతే మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పడం అసాధ్యమని నార్వే ప్రధాని జోనాస్ గర్స్టోర్ కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే మే 28నుంచి పాలస్తీనాను ప్రత్యేక దేశంగా తాము గుర్తిస్తున్నట్లు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంషెజ్ తాజాగా పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. దీంతో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడంలో తాము కూడా ముందు వరుసలో ఉన్నామని తేల్చి చెప్పారు ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్. ఈ పరిణామాలపై ఇజ్రా యెల్ ప్రతిస్పందన ఎలా ఉన్నప్పటికీ, అగ్నిగోళంలో మండుతున్న మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్ప డానికి ఐరోపా దేశాలు చొరవ తీసుకోవడాన్ని శాంతి ప్రియులు అభినందిస్తున్నారు.
ఇదిలా ఉంటే, గాజాపై పోరు విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనుసరిస్తున్న వైఖరిని ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. హమాస్పై యుద్ధం ప్రారంభించిన తొలిరోజుల్లో ఇజ్రాయెల్కు గట్టి మద్దతుదారుడిగా నిలిచింది అమెరికా. అయితే రోజులు గడిచేకొద్దీ అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. గాజాలో హమాస్పై యుద్ధం నిలిపివేసే విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య రోజురోజుకూ విభేదాలు తీవ్రమయ్యాయి. బెంజమిన్ నెతన్యాహు అనుసరిస్తున్న వైఖరి చివరకు ఆయన స్వంత దేశాన్నే గాయపరచబోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో నిబంధనలకు ఇజ్రాయెల్ కట్టుబడడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హమాస్పై యుద్ధం విషయంలో బెంజమిన్ నెతన్యాహు పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించడం విశేషం.
అంతేకాదు ఇటీవల ముగిసిన రంజాన్ మాసంలో కూడా నెతన్యాహూ అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. రంజాన్ మాసంలో కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బైడెన్ ప్రయ త్నాలు విజయవంతమైతే రంజాన్ నెల అంతా గాజాలో తుపాకుల మోతలకు ఫుల్ స్టాప్ పడేది.అయితే కాల్పుల విరమణకు బెంజమిన్ నెతన్యాహు నో చెప్పారు. దీంతో రంజాన్ మాసంలో కూడా గాజాలో తుపాకుల చప్పుళ్లు వినిపిం చాయి. దీంతో గాజాలో అమాయకుల ఆర్తనాదాలు మిన్నంటాయి.ఫలితంగా యావత్ ప్రపంచం ముందు నెతన్యాహు ఓ యుద్దోన్మాదిలా నిలబడ్డారు. ఇదిలాఉంటే హమాస్పై తమ పోరాటానికి అమెరికా ప్రజల్లో మెజారిటీ వర్గం మద్దతు ఉందని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇజ్రయెల్ అధినేత నెతన్యాహు. కొన్ని నెలల కిందట నిర్వహించిన హార్వర్డ్ – హ్యారిస్ పోల్లో దాదాపు 82 శాతం మంది అమెరికావాసులు హమాస్పై పోరాటానికి తమకు మద్దతుగా నిలిచినట్లు తేలిందంటూ అవాస్తవాలు వెల్లడించారు నెతన్యాహూ.దాదాపు ఎనిమిది నెలలు గా హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా గాజాపై యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. ప్రపంచపటంపై పాలస్తీనాను తుడిచిపెట్టేంతవరకు యుద్దానికి ఎండ్ కార్డ్ పడేదిలేదని నెతన్యాహు అనేకసార్లు బహి రంగంగానే ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే గాజా పరిస్థితి ప్రస్తుతం దారుణాతి దారుణంగా తయా రైంది. గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ప్రజల పరిస్థితి అత్యంత దయనీయం గా మారింది. గుప్పెడు మెతుకుల కోసం గాజా ప్రజలు అల్లాడుతున్నారు. గాజా దయనీయ పరిస్థితికి ఇటీవల అమెరికా స్పందించింది. ఆకలితో అల్లాడుతున్న గాజావాసులను ఆదుకోవడానికి అమెరికా ముందుకొచ్చింది. యుద్ద విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడుస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రెడీ టూ మీల్స్ పేరుతో ఆహార ప్యాకెట్లను మిలటరీ విమానాల ద్వారా ఎయిర్డ్రాప్ చేస్తామన్నారు. గాజాలో ఇప్పటికే ఆహారకొరత ఉంది. దీంతో ప్రజలు తిండి దొరక్క రోజుల తరబడి పస్తులుంటున్నారు. ఆకలి బాధ తట్టుకోలేక కొన్ని చోట్ల పశువుల దాణానే ఆహారంగా తీసుకుంటున్నారు ప్రజలు.
ఒకవైపు ఇజ్రాయెల్ బలగాల మారణహోమం మరోవైపు శిథిలమైన ఇళ్ల మధ్య, చెత్తకుండీల వద్ద తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని గాజా పౌరులు వెతుకులాడుతున్నారు. ఇదిలాఉంటే అతలాకు తలమవుతున్న గాజాకు వివిధ దేశాలనుంచి మానవతా సాయాన్ని కూడా అందకుండా ఇజ్రాయెల్ చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఆరంభమైన తొలిరోజుల్లో రోజుకు 500 ట్రక్కుల్లో గాజాకు ఆహార పదార్థాలు, మందులు తదితర సామగ్రి అందేవి. అయితే ప్రస్తుతం గాజాకు వస్తున్న ట్రక్కుల సంఖ్య 50కి మించడం లేదు. పైగా గాజాలోకి వచ్చే ఇలాంటి వాహనాల కోసం కేవలం ఒకే ఒక్క ఎంట్రీ పాయింట్ను తెరచి ఉంచడం ఇజ్రాయెల్ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోంది. గాజాకు సహాయం అందించడంపై ఐక్య రాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల సహాయక చర్యల సంస్థ చేతులు ఎత్తేసింది. దీంతో గాజావాసులు అలోలక్ష్మణా అని అలమటిస్తున్నారు.


