ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించింది. జై తెలంగాణ, ఇడ్లీ, సాంబర్ గోబ్యాక్’ అన్న నినాదాన్ని హోరెత్తించి తొలిదశ ఉద్యమానికి ఊపిరిలూదింది. ఆ తర్వాత సాగిన మలి దశ ఉద్యమంలోనూ పిడికిలి బిగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల ప్రస్థానంలో ఖమ్మం జిల్లా తన స్వరూపాన్ని మార్చుకుంది.
నిధులు, నీళ్లు, నియమకాల నినాదంతో మలిదశ ఉద్యమం ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో గడిచిన దశాబ్దకాలంలో పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లా రెండుగా చీలి కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటైంది. అయితే రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాలు ఉండగా పోలవరం ముంపు కారణంగా చింతూరు, వీఆర్ పురం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు భద్రాచలం పట్టణం మినహా మిగిలిన 20 పంచాయతీలు, బూర్గంపాడు మండలంలో కొన్ని పంచాయతీలు ఏపీలో విలీనమయ్యాయి. 2016లో జిల్లాల పునర్వి భజనతో గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలో వెంకటాపురం, వాజేడు మండలాలు ములుగు జిల్లాలో కలిసిపోయాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్వరూపం పూర్తిగా మారి పోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఖమ్మం జిల్లా అభివృద్దికి నిధుల కేటాయింపుతోపాటు పరిపాలన పరంగా అభివృద్దికి కొంత పరుగులు తీసింది. అయితే సీతారామ వంటి కీలక ప్రాజెక్టులో జాప్యం జరుగుతోంది. విభజన చట్టంలోని ఉక్కుపరిశ్రమ అమలుకు నోచుకోలేదు. విద్యా, వైద్యం నీటిపారుద లతో పాటు విద్యుత్, తాగునీరు, రహదారుల తదితర రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. గడిచిన పదేళ్లలో 50వేల కోట్లకు పైగా నిధులు కేటాయింపు జరిగినా ఇంకా పనులు పూర్తికాని పరిస్ధితి ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆనాటి సీఎం కేసీఆర్ కేబినేట్లో తొలిమంత్రిగా రోడ్లు భవనాలశాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా అభివృద్దిని పరుగుల పెట్టించారు. ఆయన హయాంలోనే సీతారామ ప్రాజెక్టు మంజూరు, భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం, భద్రాద్రి పవర్ ప్లాంట్, కేటీపీఎస్ విస్తరణ, బుగ్గపాడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ది వంటి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారులు ప్రస్తుతం పూర్తి దశలో ఉన్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పనులు పూర్తికాగా, సీతారామ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లా నుంచి రెండో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రవాణశాఖ మంత్రిగా గడిచిన ఐదేళ్లు పనిచేశారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి పది అసెంబ్లీ నియోజక వర్గాల్లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ముగ్గురు నేతలు జిల్లా అభి వృద్దిపై ఫోకస్ పెట్టారు. రాబోయ్యే ఐదేళ్ల కాలంలో జిల్లా అభివృద్ది సాధించాలంటే జిల్లాలో యూని వర్సిటీ ఏర్పాటు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, సీతారామ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు.. గోదావరి, కృష్ణ జలాలతో కృష్ణా ఆయకట్టు పాలేరు అనుసంధానం వంటి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే రైల్వే లైన్లు, ఎయిర్పోర్టు ఏర్పాటు ఇతర సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. జిల్లా అభివృద్ది, పర్యాటక సొగసులు, భద్రాచలం వద్ద ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణలో విలీనం, పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఇవన్నీ సాధ్యమేనా..? అన్న ప్రశ్న ఓ వైపు మెదులుతోంటే, మరోవైపు ముగ్గురు మంత్రు లు ఉన్న జిల్లాగా పూర్తి స్థాయి అభివృద్ధి సాధ్యమేనంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు.


