దేశవ్యాప్తంగా ఎండలు మండి పోతున్నవేళ.. 2024 లోక్ సభ ఎన్నికలు మూడో దశ పోలింగ్ కు దేశం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్ , శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వంటి ప్రముఖులు మూడో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఓటింగ్ సరళిపై ఏమేరకు ప్రభావం పడుతుందో అని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
లోక సభ ఎన్నికల్లో మూడో దశలో మే 7న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 94 నియోజకవర్గాలకు పోలింగ్ కు రంగం సిద్ధమైంది. 1352 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్ లోని అనంత నాగ్ -రజౌరీ నియోజకవర్గంలో మే7న జరగాల్సిన పోలింగ్ ను ఎన్నికల కమిషన్ మే 25వ తేదీకి వాయిదా వేసింది. ఏప్రిల్ 19న తొలిదశలో 120 నియోజకవర్గాలకు, ఏప్రిల్ 26న 88 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. గుజరాత్ లోని మొత్తం 26 నియోజకవర్గాలకు, కర్ణాటక లోని 14 నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని 11, మధ్యప్రదేశ్ లోని 9 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లోని పది నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే, అసోంలో 4, బీహార్ లో 5, చత్తీస్ గఢ్ లో 7, గోవాలో 2, నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్ లోని 4, దాద్రా, నగర్ హవేలీ, దమన్ దియోలోని 2, నియోజక వర్గాల్లో మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ లోని గాంధీనగర్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్ గఢ్ నుంచి కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా గుణ శివపురి నియోజక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మయిన్ పురి నుంచి, పోటీ చేస్తుండగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే తన బంధువు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో పోటీ పడడం విశేషం. కర్ణాటకలో 14 నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ నియోజకవర్గం నుంచి, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై హవేరీ నుంచి, జగదీస్ షెట్టార్ బెళగావి నుంచి పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కొడుకు బివై రాఘవేంద్ర శివమొగ్గనుంచి పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడుగా పనిచేసిన ఈశ్వరప్ప ఇండి పెండెంట్ గా పోటీ చేయడం విశేషం. మూడో దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రా లవద్ద పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాలవద్ద ఓటర్లకు మంచినీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ దశతో మొత్తం 302 నియోజక వర్గాల ఎన్నిక పూర్తవు తుంది.


