8 మంది.. 48 గంటలు.. సొరంగంలో చీకటి.. గాలి, వెలుతురు లేదు… అంతా బురద.. నీరు.. ఇదంతా ఎస్ఎల్బీసీ సొరంగంలోని సీన్. ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం సొరంగం లోపలికి వెళ్లిన కార్మికులు, అధికారులు.. పైకప్పు కూలడంతో కొంత మంది తప్పించుకుని సొరంగం నుంచి బయటపడ్డారు. కానీ వారిలో 8 మంది మాత్రం బయటకు రాలేకపోయారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
నాగర్కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆనకట్ట వెనుక 44 కిలోమీటర్ల పొడవైన సొరంగం శనివారం ఉదయం కుప్పకూలింది. అదే సమయంలో కొంతమంది కార్మికులు లీక్ మరమ్మతులు చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది తప్పించుకోగలిగారు. ఎనిమిది మంది మాత్రం సొరంగంలో చిక్కుకున్నారు.. శనివారం ఉదయం నుంచి వారి పరిస్థితి ఎలా ఉందో తెలియరావడం లేదు. అక్కడి నుంచి ఎటువంటి శబ్దాలు కూడా రావడం లేదు.
8 మందిలో నలుగురు కార్మికులు కాగా..మరో నలుగురు కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఉద్యోగులు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉండగా.. తాజాగా నేవీ కమాండోస్ కూడా రంగంలోకి దిగాయి. 2023లో ఉత్తరాఖండ్లో సిల్క్యరా టన్నెల్ ఆపరేషన్లో పాల్గొన్న బృందంలోని ఆరుగురు సభ్యులు కూడా ఈ రెస్క్యూ టీమ్కి జతకట్టాయి.
సొరంగం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు టన్నెల్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుని ఉన్నారు. అంటే వారిని చేరాలంటే రెస్క్యూ టీమ్ కూడా 13 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అందులోకి లోకో ట్రైన్ ద్వారా రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది.
టన్నెల్లో 11వ కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర భారీగా నీరు నిలిచిపోయింది. టన్నెల్లో రెండు పంపింగ్ స్టేషన్ల మధ్య భారీ నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రత్యేకంగా పంపులు తెప్పించి వాటర్ తోడే పనులు చేస్తున్నారు. అర్ధరాత్రి టీబీఎంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వంద మీటర్ల మేర బురదను దాటి లోపలికి వెళ్లాయి.
రాష్ట్ర, కేంద్ర స్థాయిలో అధికారులు 24 గంటల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డికి నిన్న ఫోన్ చేసి సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారు. పరిస్థితి, సహాయక చర్యలపై ఆరా తీశారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. తాము సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని.. ఉన్నతాధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. సొరంగం లోపల ప్రమాద స్థలిలో బురద నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని.. ఆక్సిజన్ అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. రెస్క్యూ బృందాలు బురదను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని.. ప్రత్యామ్యాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.