స్వతంత్ర వెబ్ డెస్క్: ఉగాండాలో దారుణం జరిగింది. కాంగో సరిహద్దు సమీపంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై సాయుధ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో 38 మంది విద్యార్థులు సహా 41 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అలయిడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్కు చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగులు వసతి గృహాన్ని తగులబెట్టి ఆహారాన్ని దోచుకున్నట్లు చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడినవారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. యుపిడిఎఫ్, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు ఇక్కడి విరుంగా నేషనల్ పార్కు దిశగా పారిపోయినట్లు గుర్తించి, ఆ దిశగా వారిని వెంబడిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
పరారయ్యే ముందు పలువురిని అపహరించుకుపోయినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. 1986 నుంచి అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని పాలనను ఏడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం ఎదురుదాడులతో తూర్పు కాంగోలోకి పారిపోయి.. అక్కడినుంచి హింసకు తెగబడుతోంది. ఏడీఎఫ్కు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తోనూ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఏడీఎఫ్ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఉగాండా ప్రభుత్వం వైమానిక, ఫిరంగి దాడులు చేపడుతోంది.