స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా తువల్తీరం బీచ్ సమీపంలో 30మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఆదివారం రాత్రి 7.30గంటల సమయంలో జరిగిన ఘటనలో 20మంది జలసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
మృతుల్లో మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వేసవి సెలవులు నేపథ్యంలో సరదాగా బోటింగ్ కు వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోయారు. పడవ బోల్తా పడడానికి కారణం తెలియరాలేదని మంత్రి అబ్దు రహిమాన్ తెలిపారు. జలసమాధి అయిన వారిలో చాలా మంది పడవ అడుగు భాగంలో చిక్కుకుపోయారని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.