స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు BRS కు వస్తాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ 100 కు పైగా స్థానాలు వస్తాయన్నారు. ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు చేసింది అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి చెప్పుకుంటే చాలు.. మన గెలుపు ఖాయం అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రతిఒక్క పథకాన్ని వివరించండి. రైతులను చెరువుల దగ్గరికి పిలిచి మీటింగ్ పెట్టండి. వాళ్లతో కలిసి భోజనాలు చేయండి.. సరిపోతుంది అని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలపై మండిపడుతూ.. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. అందుకే ప్రజలు వాళ్ళని నమ్మరు అని అన్నారు. మత రాజకీయాలు చేసే బీజేపీని ప్రజలు విశ్వసించరని అన్నారు. జూన్ 2వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా, తెలంగాణ ఖ్యాతిని చాటేలా నిర్వహించాలని అన్నారు. ఆయా జిల్లాలలో స్థానిక మంత్రులు ఉత్సవాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.