ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. నగదు అక్రమ చలామణి కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ సోరెన్ను అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిన్న ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి తదితరులు వ్యూహం మార్చి, నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్టు చేసిందని సోరెన్ తన పిటిషన్లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్భవన్కు వెళ్తే అక్కడే అరెస్టు చేయడం అన్యాయమన్నారు.