తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తలపెట్టిన రెండు దేశాల పర్యటన శుభారంభమైంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఉన్నతాధికారులతో కూడిన బృందం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ గారితో విస్తృత చర్చలు జరిపింది.
విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థతో శుక్రవారం నాడు ఎంఓయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేశ్ రంజన్ ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
సింగపూర్ ఐటీఈ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటి సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణనిస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈ లో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్లైన్, క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. ఐటీఈకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది.
పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (yisu.in) తన శిక్షకులకు ఐటీఈ తో ట్రెయినింగ్ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, స్థిరమైన హరిత ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, IT పార్కులు తదితర అంశాల్లో విస్తృత సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.