ఏపీలో టిడిపి, వైసిపి రెబల్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అనర్హత పిటిషన్ లపై విచారణకు రెబల్ ఎమ్మెల్యేలు ఈరోజు కూడా హాజరు కాలేదు. ఇప్పటికే పలుమార్లు రెబల్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిన స్పీకర్ ఈసారి వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టిడిపి, వైసిపికి చెందిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేల పై స్పీకర్ ఒకేసారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసే అవకాశం వుంది.
రాజ్యసభ ఎన్నికల ముంగిట వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకరుకు ఫిర్యాదు చేసింది. అటు టీడీపీ కూడా రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడంతో స్పీకర్ వారిని మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే వివిధ కారణాలు చూపుతూ ఇరు పక్షాల రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు డుమ్మా కొట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకోవల్సిన వారిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనం, కోటంరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి. టిడిపి రెబల్ ఎమ్మెల్యేలు వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వసుపల్లి గణేష్ ఉన్నారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను గురువారం స్పీకర్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. అయితే నోటీసులు అందుకున్నా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. తమపై మోపిన అభియోగాలకు సాక్ష్యాధారాలుగా సమర్పించిన వీడియో, ఫోటోలు ప్రసారం చేసిన, ప్రచురించిన సంస్థల నుండి ఒరిజనల్ అని సర్టిఫై కాపీలు తెప్పించి తమకు ఇవ్వాలని లేఖ రాశారు. ఆ కాపీ అందిన వెంటనే విచారణకు హాజరు అవుతామని తెలియజేశారు. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరు కాకపోవడం పట్ల ఫిర్యాదుదారు ఛీఫ్ విప్ ప్రసాద్ రాజు తప్పుపట్టారు. ఎమ్మెల్యేలు ఏదో ఒక సాకు చెప్పి విచారణ వాయిదా వేస్తున్నారని ఇప్పటికి మూడు సార్లు గైహాజరైయ్యారని పేర్కొన్నారు. స్వయంగా హాజరు కావాలని ఎన్ని సార్లు చెప్పిన హాజరు కావడం లేదని దీనితో వారిపై చర్యలు తీసుకోవాలిన స్పీకర్ ను కోరామన్నారు. తమ పార్టీ తరుపున గెలిచి సిఎం ను విమర్శిస్తున్నారని ఆ ఆధారాలన్నీ కూడా స్పీకర్ కు అందజేశామన్నారు.
టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, మద్దాల గిరి కూడా విచారణకు హాజరు కాలేదు. గతంలో వాసుపల్లి గణేష్ మాత్రమే ఒక సారి విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన టీడీపీ పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేలు విచారణకు హాజరు అయితే తక్షణం తాను కూడా వస్తానని స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అనర్హత పిటిషన్ ల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.రాజ్యసభ ఎన్నికలకు ముందు అనర్హత పిటిషన్లను వైసీపీ తెరమీదకు తెచ్చింది. దీన్ని గ్రహించి టీడీపీ కూడా అనర్హత పిటిషన్ ను దాఖలు చేయడంతో బాటు స్పీకర్ కోర్టులోకి వెళ్లింది. ఇప్పటికే పలు మార్లు విచారణకు పిలిచిన స్పీకర్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు కావడంతో స్పీకర్ సభ్యుల అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


