నాటకీయ పరిణామాల మధ్య బిహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృ త్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్న జేడీయూ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్… బీజేపీతో మళ్లీ జట్టు కట్టేందుకు రంగంసిద్ధం చేసుకున్నారు. ఇవాళ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధమయ్యారు. జేడీయూ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. నిర్ణయం వెంటనే గవర్నర్ను కలిసి… రాజీనామా సమర్పించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బిహార్ అసెంబ్లీలో మెజారిటీ సాధించే అవకాశాలు నీతీశ్కే ఉన్నాయి. బిహార్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా… ఆర్జేడీ-79, బీజేపీ -78, జేడీయూ-45, కాంగ్రెస్-19, సీపీఐ(ఎం-ఎల్)-12, హెచ్ ఏఎం-4, సీపీఎం, సీపీఐలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎంకు ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఇంకొక రున్నారు. జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం కలిస్తే వారి బలం 127కి చేరుతుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సభ్యులు కలిసినా వారి సంఖ్య 116కు మించదు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో మరోసారి నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హోం మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నారు. జేడీయూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.