రానున్న ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం భారీ మార్పులతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే…ఈ నేప థ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఐదో జాబితా సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. ఐదో జాబితాలో కూడా భారీ మార్పులు వుండే ఛాన్స్ వుందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సీట్లతో పాటు, ఎంపీ స్థానాల్లోనూ భారీగానే మార్పులు వుంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదో జాబితా విడుదలవ్వనున్న తరుణంలో టికెట్ వస్తుందో లేదో అని కొందరు ఎమ్మేల్యేలు ఆందోళన చెందుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పుల జాబితా పై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలు ప్రకటించి వైసీపీ ఐదో జాబితాని సిద్దం చేస్తోంది. మొదటి జాబితాలో 11 నియోజక వర్గాలు, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 నియోజక వర్గాల్లో మార్పులు చేశారు. ఇక నాలుగో జాబితాలో తొమ్మిది మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కలిపి 68 నియోజక వర్గాల్లో మార్పులు చేశారు. అందులో 58 అసెంబ్లీ స్థానాలు వుంటే, పది పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేశారు. ఐదో జాబితాలో మార్పులు కూడా ఉండే అవకాశం వుందనీ చెబుతున్న ఎమ్మేల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అవని గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, కనిగిరి ఎమ్మేల్యే బుర్ర మధు సూదన్ యాదవ్, కర్నూల్ ఎమ్మేల్యే హఫీజ్ ఖాన్, బనగాన పల్లె ఎమ్మేల్యే కాటసాని రామి రెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, నరసరావు పేట ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకట్ రమణలు సీఎం క్యాంప్ అఫీస్ కి వచ్చి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
మరోవైపు ఎంపీ మోపిదేవి వెంకట రమణ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. గతంలో మోపిదేవి రేపల్లె వైసీపీ ఇంఛార్జి గా వున్నారు. అయితే ఆయన స్థానంలో కొత్తగా గణేష్ అనే అభ్యర్థికి ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చింది వైసీపీ. కానీ రేపల్లె ఇంఛార్జి బాధ్యతలు మోపిదేవికి ఇవ్వాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అక్కడ అభ్యర్థి మార్పుపై చర్చించేందుకు మోపిదేవి క్యాంప్ ఆఫీస్ కి వచ్చినట్లు తెలుస్తుంది. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే గా వున్న బుర్ర మధు సూదన్ యాదవ్ ని , అక్కడ నుంచి వైసీపీ అధిష్టానం తప్పించింది. కనిగిరి బాధ్యతలు నరసింహ యాదవ్ కి అప్పగించారు. దీంతో తనకు టికెట్ విషయం ఇచ్చే అంశంపై పార్టీ నేతలతో చర్చించారు ఎమ్మేల్యే బుర్ర. తాజాగా నరసరావు పేట ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు వైసీపీకి , ఎంపి పదవికి రాజీనామా చేశారు. ఎంపీ రాజీనామా చేసిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
కర్నూల్ ఎమ్మేల్యే సీటు వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మేల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఇచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ని క్యాంప్ ఆఫీస్ కి పిలిచి ఇదే విషయం పై చర్చించినట్లు తెలుస్తోంది. బనగాన పల్లె ఎమ్మేల్యే కూడా మార్చే యోచనలో ఉంది వైసీపీ. దీంతో సిట్టింగ్ ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఐదో జాబితాలో కొన్ని ఎమ్మేల్యే సీట్లతోపా టు, ఎంపీ స్థానాలు విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీం తో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు.


