వైఎస్సార్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను ప్రజల్లోకి వచ్చానన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వై. ఎస్ షర్మిల. జిల్లాల యాత్రల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తన పర్యటన ప్రారంభించారామె. అదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్న హామీ ఏమైందంటూ జగన్ను సూటిగా ప్రశ్నించారు షర్మిల. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా తనదైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల. ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జిల్లాల పర్యటన ప్రారంభించారామె. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తన ప్రయాణం ప్రారంభించారు.
ఇచ్ఛాపురంలోని ప్రజాప్రస్థానం విజయస్థూపాన్ని సందర్శించి నివాళి అర్పించారు వై.ఎస్ షర్మిల. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉత్తేజపరిచేలా.. తన జిల్లాల పర్యటన ఉద్దేశం వివరించారు. రాష్ట్ర ప్రజల మేలు కోసమే ఇచ్ఛా పురం నుంచి తన ప్రస్తానం మొదలైందన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంత బలమో.. పార్టీ కూడా వైఎస్ కు అంతే బలమని చెప్పుకొచ్చారు. హస్తం పార్టీ రాజశేఖర్రెడ్డిని అవమానించిందంటూ కొందరు చేసే విమర్శల్లో నిజం లేదన్నారు షర్మిల. ఇక, వైసీపీ సర్కారుపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్. రాష్ట్రంలో పరిస్థితు లు చూస్తుంటే బాధగా ఉన్నాయని తెలిపారు. బీజేపీకి ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయంటూ ఆరోపించారు షర్మిల. సీఎం అయ్యాక ఒక్కరోజు కూడా హోదా గురించి జగన్ అడగలేదన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసు కొస్తా అన్న హామీ ఎక్కడికి పోయిందంటూ సూటిగా ప్రశ్నించారు షర్మిల.
అంతకుముందు.. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణించారు షర్మిల. ప్రయాణికులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. మరోవైపు…వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్. రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైసీపీ సవాల్ను స్వీకరిస్తున్నానని తెలిపారామె. సీఎం జగన్ను జగన్ రెడ్డీ అంటే వైసీపీ వాళ్లు ఫీల్ అవు తున్నారని… అంత ఇబ్బందిగా ఉంటే జగనన్నా అని పిలుస్తానంటూ చెప్పుకొచ్చారు షర్మిల. మొత్తంగా షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన సోదరుడు, సీఎం జగన్పై చేస్తున్న విమర్శలు చూస్తే… రాష్ట్రంలో అన్నాచెల్లెళ్ల సవాల్ మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


