సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తనపై ఎలాంటి చర్యలనూ ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కవిత కోరడం జరిగింది. కేసుపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది.
ఢిల్లీ మద్యం విధానం కేసు దర్యాప్తులో భాగంగా గత ఏడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు గతంలో తాను ఉపయోగించిన సెల్ఫోన్లను కవిత అధికారులకు అప్పగించారు. ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబ రులో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబరు వరకు కవితను విచారణకు పిలవ రాదని కోర్టు ఆదేశించింది. ఇంతలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు రావడంతో ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ విచారణ వెనక్కు వెళ్లింది. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు ఈ-మెయిల్లో కవిత సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కాలేనన్న కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


