ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరో సారి సమన్లు జారీ చేసినా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఢిల్లీ ఎక్సైజ్ విధానం కేసులో విచారించేందుకు ఈడీ ఎదుట హాజరు కావాలని తాజా సమన్లలో పేర్కొన్నారు. ఆ విష యం ప్రస్తుతం కోర్టులో ఉందన్న సాకుతో ఈ సారి హాజరు కాలేదు. పదే పదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు తీర్పువచ్చే వరకూ ఈడీ కాస్త ఓపికపడితే బాగుంటుందని ఆమ్ ఆద్మీపార్టీ సూచించింది.ఈడీ సమన్లు జారీ చేయడం అక్రమం అని ఆప్ పేర్కొంది. ఈ సారి ఈడీ ఎదుట హాజరుకావాలని తాను భావించానని, బడ్జెట్ సమావేశాలు, సభలో విశ్వాస తీర్మానం కారణంగా బిజీగా ఉండడంతో హాజరుకాలేక పోయానని అదనపు చీఫ్ మోట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా కు వీడియోకాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ విజ్ఞప్తి ని ఆమోదించిన కోర్టు మార్చి 16కు కేసువాయిదా వేసింది. ఇప్పటి వరకూ ఐదు సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 14న తాజాగా ఆరోసారి ఈడీ సమన్లు పంపింది. ఢిల్లీ ఎక్సైజ్ విధానం స్కామ్ లో విచారణకు ఫిబ్రవరి 19న హారుకావాలని ఈడీ ఢిల్లీ సీఎంను కోరింది.
2023 అక్టోబర్ 30న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తొలిసారి సమన్లు జారీ చేసింది. రద్దుచేసిన ఢిల్లీ లిక్కర్ విధానంలో అక్రమాలపై ప్రశ్నించేందుకు పిలిపిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ దురుద్దేశంతో ఈ సమన్లు జారీ చేశారని ఆరోపిస్తూ.. కేజ్రీవాల్ అప్పుడు హాజరుకాలేదు. రెండో సారి కూడా అదే సాకుతో హాజరుకాలేదు. జనవరి 3న ఈడి ఎదుట హాజరు కావాలని కోరుతూ డిసెంబర్ 22న మూడో సారి ఈడీ సమన్లు జారీ చేసింది. అప్పుడు రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే ఉత్సవాల సాకుతో హాజరు కాలేదు. జనవరి 18న హాజరు కావాలని జనవరి 13న నాల్గోసారి ఈడి సమన్లు జారీ చేస్తే.. తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం గోవాలో 3 రోజుల పర్యటనకు వెళ్తున్నానని సాకు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. ఫిబ్రవరి 2న హాజరు కావాలని జనవరి 31న ఐదోసారి కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. అప్పుడూ హాజరు కాకపోవడంతో తమ సమన్లు పట్టించుకోవడంలేదని ఈడీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. పదేపదే సమన్లను బేఖాతర్ చేయడం ద్వారా చట్టం ఉల్లంఘించడాని కే తప్పుడు సాకులు చెబుతున్నారని ఈడీ కోర్టుకు వివరించింది.


