అవసరమైనప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూ విమర్శలతో చీల్చి చెండా డుతుంటారు సీఎం రేవంత్ రెడ్డి. విపక్షంలో ఉన్నా.. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా ఆయన ప్రత్యేకతే వేరు. అలాం టి ముఖ్యమంత్రి రేవంత్కూ ఓ సెంటిమెంట్ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో మొదటి బహిరంగ సభ అక్కడే నిర్వహించడంతో గెలుపు రుచిచూశారాయన. దీంతో.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనూ లోక్సభ ఎన్నికలకూ సమర శంఖం అక్కడ్నుంచే పూరించనున్నారు తెలంగాణ సీఎం. ఇంతకీ ఆ సెంటిమెంట్ ప్లేస్ ఏంటని ఆలోచిస్తున్నారా.. మరెందుకు ఆలస్యం ఆ డీటెయిల్స్ మీ కోసం.
సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది తెలంగాణ కాంగ్రెస్. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న లోక్సభ ఎన్నికల కోసం శంఖారావం పూరించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరుసగా పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పోరాట పటిమతో పవర్లోకి వచ్చేలా రేవంత్ రెడ్డి చేశారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే…అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ మాత్రం గాలివాటం కాదని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ.. ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ను లోక్సభ ఎన్నికల్లో మట్టి కరిపించడం ద్వారా కోలుకోలేని విధంగా దెబ్బ తీయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు సీఎం రేవంత్.
ఈ క్రమంలోనే సాధ్యమైనంత తర్వగా సార్వత్రిక ఎన్నికల ప్రచార రంగంలోకి దూకేందుకు నిర్ణయించారు. అనుకు న్నట్లుగానే ఫిబ్రవరి 2 నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని జెట్ స్పీడుతో పరుగులు పెట్టించనున్నారాయన. అయితే.. ఇక్కడే తనకు ఎంతో కలిసి వచ్చిన చోటు నుంచి ప్రచారాన్ని ప్రారంబించబోతున్నారు ముఖ్యమంత్రి. అవును.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సభ ద్వారా ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గతంలో హామీ ఇచ్చిన మేరకు ఇక్కడున్న అమరవీరుల స్థూపం వద్ద స్మృతి వనం నిర్మాణా నికి శంఖుస్థాపన చేయడంతోపాటు స్థానికంగా ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించే నాగోబా జాతరలోనూ పాల్గొంటారా యన.
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్.. ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించడానికి కారణం ఈ ప్రాంతం ఆయనకు సెంటిమెంట్ కావడమే. నిజమే.. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆగస్ట్ 9, 2021న దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సభ పేరుతో బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ నాటి సభలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించారు. హస్తం పార్టీని గెలిపించా లని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ హోదాలో నిర్వహించిన పలు కార్యక్రమాలు, సభలు విజయవంతమయ్యా యి. చివరకు మొన్నటి ఎన్నికల్లో రేవంత్తోపాటు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయన సీఎం అయ్యారు. దీంతో.. ఈ సెంటిమెంట్ మరింత బలపడింది. ఇదే విషయంపై రేవంత్ రెడ్డి తన సహచరులతో పలుమార్లు చెప్పినట్లు ప్రచారం కూడా సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతోపాటు ప్రత్యర్థి ఇప్పుడు బలహీనంగా ఉన్న పరిస్థితులను అవకాశంగా చేసుకొని మరింతగా విజృంభించేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో కనీసం 13 నుంచి 14 ఎంపీ సీట్లు టార్గెట్గా పెట్టుకుంది. మరి.. గతంలో మాదిరిగానే సీఎం రేవంత్ సెంటిమెంట్ ఫలిస్తుందా ? అంచనా వేసినట్లుగా లోక్సభ స్థానాలు హస్తం ఖాతాలో పడతాయా ? అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.