ఎవరిది కుట్ర…ఇప్పుడు ఇదే మాట ఏపీ రాజకీయాల్లో మరోసారి మార్మోగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల వరకు సమయం ఉందన్న వేళ.. వై.ఎస్ మరణం విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. వైఎస్ మృతి వ్యవహారంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించడమే ఇందుకు కార ణం.
ఏపీ రాజకీయాలు రోజురోజుకీ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగు తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ మరోసారి తెరపైకి వచ్చింది వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం విషయం. చిత్తూరు జిల్లాలో రచ్చబం డకు వెళుతూ హెలికాఫ్టర్ కూలిపోవడంతో చనిపోయారు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి. అయితే.. ఆయన మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల వరకు సమయం ఉంది. ఇలాంటి వేళ జగన్ ప్రభుత్వ సలహా దారు స్వయంగా సీఎం తండ్రి అయిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం గురించి ప్రస్తావించడంపై జోరుగా చర్చ సాగు తోంది. అంతేకాదు.. వైఎస్ మరణం తర్వాత కేంద్రంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కుమ్మక్కై.. జగన్పై తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సజ్జల.
వైసీపీని స్థాపించాక సైతం ఈ కుట్రలు సాగాయని ఆరోపించారు సజ్జల. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లోనూ జగన్తోపాటు విజయమ్మను ఓడించడం ద్వారా వైసీపీని మొగ్గలో తుంచివేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు సజ్జల. అసలు.. వై.ఎస్ రాజశేఖర్రెడ్డి మరణించినప్పటి నుంచీ తెరవెనుక కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించారంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారాయన. జగన్ను నేరుగా ఎదుర్కోలేకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని…రానున్న రోజుల్లో జరగబోయే డ్రామా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపణలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల.
సజ్జల వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో.. ఈ వ్యవహారంపై స్పందించారు కాంగ్రెస్ నేతలు. కేవలం రాజకీయాల కోసమే వై.ఎస్ మరణం విషయాన్ని తెరపైకి సజ్జల తీసుకొచ్చారని విమర్శించారు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ. వై.ఎస్ మృతిపై అనుమానాలుంటే విచారణకు ఎందుకు ఆదేశిం చలేదంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. మరి.. రాబోయే రోజుల్లో ఇవి ఎంతవరకు వెళతాయి అన్నది ఉత్కంఠ రేపుతోంది.