లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్లో వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరే లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని రేవంత్ & కో భావిస్తుండగా… లోక్ సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ చేసి బీఆరెస్స్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలని గులాబీ టీం ప్రయత్నిస్తోంది. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి ప్రజల్లోకి వస్తుండడం..అటు రేవంత్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంతో మళ్లీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరకుంటోంది. మరి కేసీఆర్ రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయి..? కారు స్పీడ్ మళ్లీ పెరుగుతుందా..? అసెంబ్లీలో మాటల యుద్ధం తప్పదా..? కాంగ్రెస్ సర్కార్ దూకుడుని గులాబీ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది..?
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో మూడు పార్టీలు సమరానికి సమాయత్తం అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. అదే ఊపును లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని వ్యూహాలు పన్నుతోంది. ఇక ఇన్నాళ్లు రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. తుంటి మార్పిడి సర్జరీ కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్..ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. దీంతో ఇప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని.. కాంగ్రెస్ సంగతి తేలుస్తారని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన చెప్పినట్టుగానే..కేసీఆర్ అసెంబ్లీకి రావడం..కేసీఆర్ రీ ఎంట్రీతో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో లోక్ సభ ఎన్నికలను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమావేశాలు జరుపుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడ్ చేస్తున్నారు. ఇకనుంచి కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కెసిఆర్ రంగంలోకి దిగితే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందని బిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో సుడిగా పర్యటన చేస్తారని సమాచారం. ఈమేరకు ముహూర్తం చూసుకుం టున్నారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన పార్టీలో ఉత్సాహం నింపుతారని తెలు స్తోంది.అయితే కేసీఆర్ రాకముందు రాజకీయం ఒక ఎత్తు, ఎంట్రీ తర్వాత మరోఎత్తు అన్నట్లుగా రాష్ట్ర రాజకీయం మారబోతోంది. ఇన్నాళ్లు కేసీఆర్ సైలెంట్ గా ఉండడంతో ఆ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. అయితే ఇప్పుడు కేసీఆర్ రీ ఎంట్రీతో మళ్లీ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంటుందని అంటున్నారు. మరోవైపు ఇప్పుడు అందరి దృష్టి సీఎం రేవంత్పై పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం.. ప్రాథమిక నివేదిక కూడా తెప్పించుకున్నారు. ఇందులో ఒక్క మేడిగడ్డలోనే రూ.3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కేసీఆర్తోపాటు, మాజీ మంత్రి హరీశ్రావుపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. చాలా మంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయ్. బాలకృష్ణ అరెస్ట్తో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు చేశాడని.. భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకున్నాడని.. రాజకీయ నేతలకు కావాల్సినట్లుగా వ్యవహరించడం వంటివి చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఇందులో మాజీ సీఎస్్కు హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున భూమి ఉన్నట్లుగా బయటపడింది. ఈ భూమికి సంబంధి ఆధారాలను ఏసీబీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గులాబీ బాస్ కేసీఆర్ రీ ఎంట్రీతో ఆ పార్టీ కేడర్లో జోష్ కనిపిస్తోంది. ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు తన పదునైన మాటలతో ప్రత్యర్థులపై కేసిఆర్ పై చేయి సాధించారు. మరి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఆయన ఏ రీతిలో వ్యవహరిస్తారనే అంశం ఆసక్తిగా మారింది.