జాతర్లలో మటన్ ముక్క, కల్లు చుక్క సాధారణమే. ముక్క మాట ఎలా ఉన్నా మేడారం జాతరలో మద్యం చుక్కకు మాత్రం బహు చక్కని ధర పలుకుతోంది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడా లేని మద్యం ధరలను ఇక్కడ వసూలు చేస్తున్నా రు. ముడుపుల మత్తో, బడాబాబుల మద్దత్తో తెలియదు కాని, ఆబ్కారీ శాఖా అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారు. అతి పెద్ద మేడారం గిరిజన జాతరలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వైనం.
యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం జాతర. గిరిజన జాతరమైనా..ఆదివాసీలతో పాటు అసంఖ్యాకంగా గిరిజనేతరులు సైతం ఈ యాత్రకు తరలివస్తారు. కోట్ల సంఖ్యలో భక్తులు ఈ మహత్తర, మహోన్నత జాతరకు తరలివస్తారు. మేడారం జాతరలో ఏ వర్తక, వ్యాపారం సాగించిన వారైనా కోట్లకు పడగలెత్తుతారు. ఇక్క సుక్క, ముక్కలో ముక్క విషయాన్ని పక్కన పెడితే, సుక్క ధరలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఈ జాతరలో కనీవినీ ఎరుగని ధరలతో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఇంత అధికధరలు లేవని మందుబాబులు వాపోతున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో మద్యం దుకాణం యజమానులు ఇష్టానుసారం ధరలు పెంచే సి విక్రయాలు సాగిస్తున్నారు. బాటిల్ పై ఉన్న ఎమ్మార్పీ రేటు కంటే క్వార్టర్ బాటిల్ కు 50 రూపాయల చొప్పున మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. అదే, ఫుల్ బాటిల్ అయితే 100 నుంచి 150 రూపాయలు అధికంగా వసూలు చేసి విక్రయా లు చేస్తున్నారు. అబ్కారీ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఆదాయం రావడం మంచి విషయమే. అయితే, అబ్కారీ శాఖ అధికారులు ముడు పులు స్వీకరించి.. చూసి చూడనట్టు వ్యవహరించడంపై యాత్రికులు మండిపడుతున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అట్టహాసంగా జరగనుంది. ప్రభుత్వ లాంఛన్లతో నిర్వహించే మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తర లి రావడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది మేడారం జాతరకు నెల ముందు నుంచే భక్తుల తాకిడి అధికమైంది. యావత్ విశ్వంలోనే ఇంత పెద్ద గిరిజన జాతర మరెక్కడా జరగదనే విషయం అందరికి తెలిసిందే. అధిక సంఖ్యలో వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేయడానికి మద్యం షాపుల యజమానులు రెడీ అయినట్టు తెలుస్తోంది. మేడారంలో, కొత్తూరులో బ్రాందీ షాపుల యజమానులు సిండికేట్ గా మారి దందా సాగిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయాలు సాగించి, జాతరకు వస్తున్న మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మేడారం జాతరలో పది కిలోమీటర్ల మేర అడుగడుగునా బెల్ట్ షాపు ఉంది. ఈ దుకాణాలన్నింటికి వీరి నుంచే మద్యం సరఫరా అవుతోంది. అనుమతి పొందిన మద్యం షాపు ఓ పక్క రిటైల్ గా అమ్ముతూ, మరో పక్క అధిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయాలు సాగిస్తోంది.
మద్యం బాటిల్ పై ఉన్న ఎమ్మార్పీ కంటే 25 రూపాయలు అధికంగా బ్రాందీ షాపు దుకాణదారులు బెల్ట్ షాప్ ల వారికి విక్రయాలు చేస్తున్నారు. ఇక, బెల్టు షాపుల వారు మరో 25 రూపాయలు అదనంగా వేసి క్వార్టర్ బీరుపై ఎమ్మార్పీ కంటే 50 రూపాయలు దండుకుంటున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న ఆబ్కారీ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహ రిస్తున్నారు. ఆబ్కారి శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి ఏ ఫిర్యాదులు పట్టించుకోక పోవడంతో… జాతరకు వస్తున్న మద్యం ప్రియుల జేబులు ఖాళీ అవుతున్నాయి. మద్యం దుకాణాల యజమానుల గల్లా పెట్టెలు గలగలలాడు తున్నాయి. మరో 15 రోజుల్లో అసలైన మేడారం నిండు జాతర ప్రారంభం కానుంది. కోట్ల సంఖ్యలో వచ్చే భక్తుల్లో సగం మంది మద్యం ప్రియులు ఉన్నా.. మద్యం దుకాణ యజమానుల దోపిడీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా ఆబ్కారీ అధికారులు తమ కర్తవ్యాన్ని గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించే మద్యం దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అమ్మవార్ల జాతరకు వచ్చే మద్యం ప్రియులకు అన్ని బ్రాండ్లు ఎమ్మార్పీ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.