విశాఖ జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి చూపు ఎటువైపు..! వైసీపీ అధిష్టానం ఆయనకు తిరిగి ఆ సీటు కట్టబెడు తుందా ? లేక టీడీపీ, జనసేనలోకి ఆయనేమైనా జంపయ్యే అవకాశాలున్నాయా ? ఒకప్పుడు అధికార పార్టీలో ఓ వెలు గు వెలిగిన ఆయన ప్రభ మసకబారడానికి కారణం ఏంటి ? జనంలో విన్పిస్తున్నట్లుగా అధికార దాహమా… ప్రజలంటే నిర్లక్ష్యమా, లేక అవినీతి ఆరోపణలా.. ఇవన్నీ కాకుంటే మహిళల విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలా? కీల కంగా మారిన 2024 ఎన్నికల్లో ఆయనకు ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే చాలానే కారణాలున్నాయన్న వాదన వినిపి స్తోంది.
ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి తెలుసో కానీ, అవంతి శ్రీనివాస్ అంటే పరిచయం అక్కర్లేని పేరనే చెప్పాలి. విద్యారంగంలో భారీగా పేరు గడించిన ఆయన.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుం టూ వెళుతున్నారు. అయితే.. పలుమార్లు పార్టీ మారడంతో వచ్చిన అపప్రద అంతా ఇంతా కాదనే చెప్పాలి. కానీ, అవేవీ ఆయన రాజకీయ ప్రస్థానానికి ఏమాత్రం అడ్డుకాలేదు. ఎమ్మెల్యేగా మొదలైన ఆయన ప్రస్తానం వైసీపీలో తారస్థాయికి చేరింది. చివరకు జగన్ సర్కారు తొలి మంత్రివర్గంలోనే పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తనదైన ముద్ర వేయడంలో మాత్రం ఆయన విఫలమయ్యారనే విమర్శలే ఎక్కువగా విన్పించాయి.
మరి…రాబోయే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ పరిస్తితి ఏంటి అంటే అప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. వైసీపీ అధిష్టానం ఆయనకు భీమిలి నుంచి మరోసారి టికెట్ ఇస్తుందా అంటే ఇస్తుంది అని చెప్పేవాళ్ల కంటే ఇవ్వకపోవచ్చు అని చెప్పేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇందుకు కారణాలు అనేకమనే విమర్శలున్నాయి. ప్రజారాజ్యం నుంచి రాజ కీయ ఆరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాస్…ఆ తర్వాతి కాలంలో టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. అనంత రం వైసీపీ హవా గమనించి ఫ్యాను కిందకు చేరిన ఆయన.. తనదైన రాజకీయాలు చేసి మంత్రి పదవి సంపాదించా రన్న ఆరోపణలున్నాయి. పోనీ మంత్రి అయిన తర్వాతైనా ఈయనలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే లేదన్న వాదనే బలంగా విన్పిస్తోంది. పైగా కొందరు మహిళలతో అరగంట, గంటా అంటూ ఆయన కామెంట్లు చేసినట్లుగా చెబుతున్న ఆడియోలు తెగవైరలయ్యాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారేలా చేశాయి. చివరకు ఈ విషయంలో వైసీపీ పెద్దలు జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దే వరకు విషయం వెళ్లిందంటేనే వ్యవహారం ఎంతవరకు వచ్చిందన్నది అర్థం చేసుకోవచ్చు. తర్వాతి కాలంలో వైసీపీ మంత్రివర్గం నుంచి స్థానం కోల్పోయిన అవంతి.. మెల్లమెల్లగా పార్టీలో సైలెంటయ్యారు. దీంతో కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా నానాటికీ అవంతి పరిస్థితి, ప్రభావం తగ్గి చివరకు ఆయనకు సీటు విషయంలో వైసీపీ అధిష్టానం ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఎక్కడిదాకో ఎందుకు మొన్నటికి మొన్న భీమిలి వేదికగా పార్టీ కేడర్ను అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేస్తూ వైసీపీ అధినేత సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలో భీమిలి అభ్యర్థి అంటూ ఆయన పేరను కనీసం ప్రస్తావించలేదు వైసీపీ అధినేత. దీంతో ఆయన అభ్యర్థిత్వంపై మరిన్ని సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఈ విషయంలో ఆయనకు ఇప్పటికే క్లారిటీ ఉందని అందుకే పక్క పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అవంతి శ్రీనివాస్ టీడీపీలో ఏమైనా చేరతారా అంటే చెప్పలేని పరిస్థితులే నెలకొన్నాయి. ఇందుకు కారణం గతంలో తలెత్తిన పరిస్థితులే. 2019లో నాటి సీఎం చంద్రబాబు నాయుడుతో ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపుతూ ఆ శిబిరం నుంచి హఠాత్తుగా లేచి వెళ్లి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించడం తెలుగు దేశం అధినేతకు ఆగ్రహం తెప్పించిందనే చెప్పాలి. ఇక, వైజాగ్ సిటీలో ఉన్న మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విమర్శించిన తీరు సైతం సరికాదన్నది టీడీపీ నేతల అభిప్రాయం. ఇవన్నీ కలిసి టీడీపీలో ఆయన చేరికను అడ్డుకుంటున్నాయన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. పైగా ఈసారి టీడీపీ పవనాలు బలంగా వీస్తాయని తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గతంలో తమను తీవ్రంగా దెబ్బకొట్టిన అవంతిని పార్టీలోకి ఆహ్వానిస్తారా అంటే లేదనే చెప్పాలి. పైగా సింహాచలం భూముల విషయంలో ఈయనపై వచ్చిన ఆరోపణలు టీడీపీ హయాంలో వచ్చినవే. దీంతో.. ఆయన కు టీడీపీలో అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. జనసేన వైపే అవంతి మొగ్గు చూప వచ్చన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. ఇప్పటికే జనసేనలోకి తన ముఖ్య అనుచరుడని పంపిన ఆయన.. త్వరలో నే పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటికే విశాఖ సిటీలో జనసేన టికెట్లు ఆశిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరి అలాంటి వారందర్నీ కాదని… అవంతికి పెద్ద పీట వేస్తారా అంటే డౌటే. ఇవన్నీ ఎలా ఉన్నా రాజకీయాలంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అంగ, అర్థ బలానికి పాలిటిక్స్ లో ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. మరి ఆ రెండూ పుష్కలంగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారు అంటే ఇప్పుడే చెప్పలేకపోయినా మరికొన్ని రోజుల్లో మాత్రం క్లారిటీ రానుంది.