యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఆయిల్ ట్యాంక్ లతో వెళుతున్న నౌకపై క్షిపణితో దాడి చేశారు. దీంతో బ్రిటన్కు చెందిన మార్లిన్ లాండ నౌకలోని కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు. సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎడెన్కు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన వెంటనే యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహ రించినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈ మార్గంలో వెళుతున్న నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఒక క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు గత కొద్దిరోజులుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకల లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.