కొమురం భీం జిల్లా దరిగాంలో పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పులి మిస్సింగ్పై మూడో రోజు వెతుకు తు న్నారు ఫారెస్ట్ అధికారులు. గాలింపు చర్యల్లో ఆరు డివిజన్ల సిబ్బంది పాల్గొంటున్నారు. పులుల మరణాల కేసులో విచారణ ఏ మాత్రం ముందుకు కదలడం లేదు. ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లను విచారించారు ఫారెస్ట్ అధికారులు. కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా.. జల్ జంగిల్ జమీన్ అంటూ గర్జించిన నేల. ఇప్పుడు అటవిశాఖ సర్చ్ ఆపరేషన్ తో దద్దరిల్లిపోతోంది. కొమురంభీం అడవుల్లో ఇప్పుడు ఆ బెబ్బులి మరణం అరణ్య రోదనై ద్వనిస్తోంది. ఎవరు చంపారో తెలియదు.. ఎలా చనిపోయాయో తెలియదు. రెండు రోజుల వ్యవదిలో రెండు పులులు మరణించడం సంచలనంగా మారింది.
కాగజ్ నగర్ కారిడార్లోని కాగజ్ నగర్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం దరిగాం.. చుట్టూ కొండలు గుట్టలు.. సెలయేల్లు.. ఈ ప్రాంతంలో డిసెంబర్ 27న ఓ పశువు పులిదాడిలో హతమైంది. అనంతరం జనవరి 3 న దరిగాం అటవి ప్రాంతంలోని కొమురంభీం కాలువకు సమీపంలోని ఓ వాగు వద్ద నీళ్లు తాగేందుకు వచ్చి 18 నెలలున్న ఆడపులి చనిపోయింది. పశువుల కాపరులు జనవరి 6 న అటవిశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆడపులి మృతి బయటపడింది. ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం పులి శరీర భాగాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ కు పంపించారు. అటవిశాఖ షాక్ అయ్యేలా ఆడపులి చనిపోయిన కూతవేటు దూరంలో మరో పులి చనిపోవడం.. ఆ పులి మెడ చుట్టు ఉచ్చు బిగిసి ఉండటం సంచలనంగా మారింది. వెంటనే అలర్ట్ అయిన అటవిశాఖ హుటాహుటిన ఉన్నతాదికారులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్టాయి.
పులి మరణానికి ఆదిపత్య పోరు కారణం కాదని.. ఎవరో మాటు వేసి మందు పెట్టి రెండు పులులను హతమార్చారని తేలడంతో జిల్లా అటవిశాఖ అప్రమత్తమైంది. ఎన్టీసీఏ , పీసీసీఎఫ్ చీఫ్ ఆర్ఎం డెబ్రియాల్ రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో అసలు గుట్టు రట్టైంది. పులులు చనిపోయింది పశువు మాంసం తినడం కారణంగానేనని.. ఆ పశువు చనిపోయాక దాని పై గడ్డి మందు చల్లి, విషగులికలు కలిపారని.. ఆ ఎద్దు మాంసం తిన్న పులులు నీళ్లు తాగేందుకు వెళ్లి హతమయ్యాయని తేలింది. అయితే చనిపోయింది రెండు పులులే అయినా.. మరో రెండు పులులు మిస్ అవడం అటవిశాఖ ఆందోళనను అమాంతం పెంచేసింది. దీంతో కనిపించకుండా పోయిన ఆ రెండు పులుల ఆచూకీ కోసం హైలెవల్ సర్చ్ ఆపరేషన్ కు రెడీ అయింది అటవిశాఖ. మూడు రోజులుగా పులల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.