రైతులు తలపెట్టిన మెగా మార్చ్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పంజాబ్, హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. డిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టియర్ గ్యాస్ యోగంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండి పోయాయి. డ్రోన్లతో స్మోక్ బాంబ్స్ను జారవిడిచారు. దీంతో నిరసనకారులు, మీడియా ప్రతినిధులు పరుగులుపెట్టినట్లు తెలుస్తోంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పనకు డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఢిల్లీ సరిహద్దులో రైతులను పోలీసులు అడ్డుకన్నారు. పంజాబ్-హర్యానా శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రైతులను అడ్డుకునేం దుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీని అష్టదిగ్భంధనం చేసేందుకు సిద్ధమైన రైతులు.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారి కేడ్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల కాంక్రీట్ బ్లాక్స్, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. ఢిల్లీ అంతటా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్ సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను మూసివేశారు. పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి వెళ్తున్నారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. గాజీపుర్, చిల్లా సరిహద్దుల్లోని హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. కిలోమీటరు దూరానికే గంటకు పైగా సమయం పడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.