అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ సహా పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో నగారా మోగుతుందన్న వేళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో… పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మెగా డీఎస్సీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 6వేల ఒక వంద పోస్టులతో డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా, వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు ఆమోదం తెలిపింది మంత్రి వర్గం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఐదు వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. తాజాగా జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు అనుమతిచ్చింది. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేసింది జగన్ కేబినెట్. దీంతోపాటు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.