స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి విపక్షాల ‘ఇండియా’ కూటమి బలం… ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని.. ప్రతిపక్ష కూటమి నేతలు ప్రతీకార రాజకీయాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముంబయిలో జరుగుతున్న విపక్షాల మూడో సమావేశంలో ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
గత తొమ్మిదేళ్లలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యాప్తి చేసిన మతపరమైన విషం.. ఇప్పుడు రైలు ప్రయాణికులు, స్కూల్ విద్యార్థులపై జరుగుతున్న దారుణాల్లో కనిపిస్తోందని ఖర్గే ఆరోపణలు చేశారు. ఇటీవలే హోమ్వర్క్ పూర్తి చేయనందుకు గాను ముస్లిం చిన్నారికి చెప్పుతో కొట్టమని మిగతా విద్యార్థులకు టీచర్ చెప్పిన ఘటనను ఖర్గే పరోక్షంగా ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వ పగ రాజకీయాల కారణంగా రానున్న నెలల్లో మరిన్ని దాడులు, అరెస్టులకు ప్రతిపక్ష నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. విపక్ష కూటమి ఎంత పుంజుకుంటే బీజేపీ ప్రభుత్వం అంతలా ఇండియా కూటమి నాయకులపై దాడులకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.
కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్డౌన్ ప్రారంభమైందని ఖర్గే తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్మ్యాప్ను ఖరారు చేసేందుకు సమావేశమైన ఇండియా కూటమి నేతల గ్రూప్ ఫొటోను ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. “జుడేగా భారత్, జీతేగా ఇండియా. ప్రగతిశీల, సంక్షేమ ఆధారిత, సమ్మిళిత భారతదేశం కోసం మేము ఐక్యంగా ఉన్నాం. 140 కోట్ల మంది భారతీయులు మార్పును తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వ నిష్క్రమణ కౌంట్డౌన్ ప్రారంభమైంది!” అని రాసుకొచ్చారు.
అంతకుముందు.. ముంబయిలోని గ్రాండ్హయత్లో విపక్షాల కూటమి శుక్రవారం ఉదయం భేటీ అయింది. చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను అభినందిస్తూ విపక్ష కూటమి తీర్మానం ఆమోదించింది. అందులో ఇస్రో సామర్థ్యాలను విస్తరించడానికి ఆరు దశాబ్దాలు పట్టిందని పేర్కొంది. ఇలాంటి అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయని.. యువత సైన్స్లో రాణించడానికి స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆదిత్య-ఎల్1 మిషన్ ప్రయోగానికి ప్రపంచమంతా ఆసక్తిగా వేచి చూస్తోందని చెప్పింది.