సామాన్య నటుడుగా కెరీర్ స్టార్ట్ చేసి.. అసామన్యుడుగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలెంచలుగా ఎదిగారు. చిరు జీవి నుంచి చిరంజీవి అయ్యారు. ఆయనకు కేంద్రప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డ్ ను ప్రకటించడంతో.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలియచేశారు.
సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా మారి స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచి నటన పై మక్కువతో చదువు పూర్తి చేసుకొని 1976లో చెన్నై వెళ్లారు. అక్కడ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. 1978లో పునాది రాళ్లు సినిమాతో హీరోగా మారారు చిరంజీవి కానీ ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు అనే సినిమా రిలీజ్ అయ్యింది. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక హీరోగానే కాదు విలన్ గాను నటించారు చిరంజీవి. 1979లో వచ్చిన ఐ లవ్ యు అనే సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.. స్టార్ హీరోలుగా రాణిస్తున్న సమయంలోనూ చిరంజీవి తన సినిమాలతో ఆకట్టుకొని అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బ్రేక్ డ్యాన్స్ లకు మెగాస్టార్ చిరంజీవి పెట్టింది పేరు. ఆయన స్టెప్పులకు ఊగని ప్రేక్షకులు ఉండరు. యాక్షన్ హీరోగానే కాదు.. చంటబ్బాయి సినిమాలో హాస్యప్రధాన పాత్రలో కూడా నటించి మెప్పించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
చిరంజీవి కెరీర్ లో మరిచిపోలేని సినిమా అంటే… ఖైదీ. ఆ సినిమా పెద్ద విజయం సాధించి ఎంతో పేరు తీసుకువచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఖైదీకి ముందు.. ఖైదీ తర్వాత అనాల్సిందే. తొలినాళ్లలో సుప్రీం హీరోగా అలరించిన చిరంజీవి ఆతర్వాత మరణమృదంగం సినిమాతో మెగాస్టార్ అయ్యారు. కేవలం హీరోగానే కావు కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లోనూ నటించారు. 2001 లో వచ్చిన శ్రీమంజునాథ సినిమాలో శివుడిగా కనిపించరు. అలాగే 2013 లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాలో శివుడిగా కనిపించరు. అలాగే స్టైల్ మూవీలో కూడా గెస్ట్ రోల్ లో కనిపించారు.
బ్లక్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో సేవ చేశారు.. చేస్తున్నారు. కరోనా టైమ్ లో సినీ కార్మికులకు అండగా నిలిచారు. ఆ కష్టకాలంలో సినీ కార్మికులు అందరికీ నిత్యవసరాల సరుకులు ఉచితంగా పంపిణి చేశారు. అలాగే తన దృష్టికి వచ్చిన ఏ సమ్యస అయినా వెంటనే పరిష్కరించేవాళ్లు. మనకు సమస్య వస్తే.. చిరంజీవి ఉన్నారు ఆయన దృష్టికి వెళితే చాలు మన సమస్యను పరిష్కరించేస్తారు అనే నమ్మకాన్ని ఇండస్ట్రీలో కలిగించారు. పద్మవిభూషణ్ అవార్డ్ ప్రకటించిన సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా వెన్నంటి నడిచే లక్షల మంది అభిమానుల ప్రేమ ఆదరణ వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అన్నారు. ఈ గౌరవం వాళ్లదే అని చిరంజీవి తన స్పందన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.