ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై ఒక్కొక్క వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డిమాండ్ల సాధన కోసం ఇటీవల అనేక వర్గాలు సమ్మెబాట పట్టాయి. మునిసిపల్ కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు ఇటీవల కొన్ని రోజుల పాటు సమ్మె చేశారు. వీరే కాదు….జగన్మోహన్ రెడ్డి స్వంత సైన్యంగా పేరున్న వాలంటీర్లు కూడా కొంతకాలం కిందట సమ్మె చేసి హల్చల్ చేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆంధ్రప్రదేశ్లోని కార్మికలోకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కార్మికుల సమస్య లను జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు మిన్నంటాయి. బతుకుబండి నడుపుకోవడానికి చిన్న చిన్న పనులు చేస్తుంటారు కార్మికులు. ఇలా కూలీనాలీ చేసుకుని బతికే కార్మికులు దైనందిన జీవితంలో అనేక సమ స్యలు ఎదుర్కొంటారు. కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వా లపై ఉంటుంది. అసంఘటిత కార్మికుల సమస్యల విషయంలో కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మునిసిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వర్కర్లను పర్మినెంట్ చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. తమ డిమాండ్లు సాధించుకు నేంతవరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు కుండబద్దలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు తమ తమ పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. కడప నగరంలో అయితే మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గుండు కొట్టించుకుని వినూత్నంగా నిరసన తెలియచేశారు కార్మికులు.
శ్రీకాకుళం జిల్లాలోనూ మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో సమ్మె చేశారు. దీక్ష శిబిరం వద్ద పొర్లు దండాలు పెడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. తమ డిమాండ్ల సాధనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. మునిసిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగు తుండటంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. కార్మిక సంఘాల నేతలతో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం హుటాహుటిన చర్చలు జరిపింది. జీతాలపెంపునకు సంబంధించి కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో దాదాపు పది రోజుల కిందట మునిసిపల్ కార్మికులు సమ్మె విరమించారు. విధుల్లోకి చేరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల అంగన్వాడీ వర్కర్లు కూడా సమ్మె బాట పట్టారు. అయితే తాజాగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె విరమించారు. తాజాగా జగన్ ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల నేతలు జరిపిన చర్చలు సఫలమ య్యాయి. అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం పదకొండు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచగా అందులో పది డిమాండ్లకు జగన్ సర్కార్ అంగీకరించింది అందుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే మొత్తాన్ని కూడా పెంచింది. మరణించిన వారి కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వడానికి అంగీకరించింది.ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు సమ్మె విరమించి, డ్యూటీల్లో చేరారు.
ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వాలంటీర్లు ఇటీవల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. వాలంటీర్లను, జగన్మోహన్ రెడ్డి సర్కార్ స్వంత సైన్యంగా అందరూ భావిస్తారు. 2019 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్ వ్యవస్థకు పేరు వచ్చింది. ఇదిలా ఉంటే కిందటేడాది డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వాలంటీర్లు యుద్ధం ప్రకటించారు. తమకు నెలకు ఇచ్చే ఐదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్న వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని సర్కార్పై మండిపడ్డారు.
ఒక దశలో ఆడుదాం….ఆంధ్రా కార్యక్రమాన్ని బహిష్కరించాలని కూడా వాలంటీర్లు నిర్ణయించుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వెంటనే రంగంలోకి దిగారు. వాలంటీర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆడుదాం. …ఆంధ్రా కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కోరారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రమే వాలంటీర్లు సమ్మె బాట పట్టారు. మరికొన్ని చోట్ల సర్కార్ హామీలపై భరోసాతో సమ్మె కు దూరంగా ఉన్నారు. ఏమైనా చివరకు వాలంటీర్లు వెనక్కి తగ్గారు. దీంతో కథ సుఖాంతమైంది. మొత్తంమీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై సమాజంలోని ఏ వర్గామూ సంతోషంగా లేదన్న విషయం స్పష్టమైంది.