అయోధ్యలో బాలరాముడు భక్తులకు సాక్షాత్కరించాడు. బాల రాముడు ఎలా ఉంటాడో అన్న కోట్లాది మంది భక్తుల ఉత్కంఠకు తాజాగా తెరపడింది. కృష్ణ శిలతో రూపుదిద్దుకున్న బాల రాముడి విగ్రహం భక్తులకు దర్శనమిచ్చింది. దీంతో బాలరాముడిని చూసి భక్తులు తరిస్తున్నారు. కృష్ణ శిలతో తయారైన బాల రాముడి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా ప్రాణ ప్రతిష్ఠ రోజున కళ్లపై ఉన్న తెరను తొలగిస్తారు. అయితే, రాముడి కళ్లకు గంతలు తొల గించారు. దీంతో ముందుగానే అందరికీ బాల రాముడి దర్శనభాగ్యం కలిగింది. మైసూరుకి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకున్న బాల రాముడి విగ్రహం ప్రాణం పోసుకుంది.
బాలరాముడి విగ్రహం వైపే ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనే కీలకం. బాలరాముడికి ఒకటి కాదు…రెండు కాదు….అనేక ప్రత్యేకతలున్నాయి. పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ శోభాయమానంగా వెలుగులు చిందిస్తున్నాడు బాల రాముడు. ఐదేళ్ల వయసులో శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఎలా ఉండేవారో సరిగ్గా ఆ రూపంలో బాలరాముడు కనిపిస్తాడు. చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకొని ఉన్న బాల రాముడి రూపం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
బాలరాముడి విగ్రహం పాదాల నుంచి నుదిటి వరకు 51 అంగుళాల ఎత్తు ఉంటుంది.విగ్రహం బరువు 150 కేజీలు. నల్లని కలువ తామరపై ఐదేళ్ల బాలరాముడి రూపంలో మూలవిరాట్ ఉన్నారు. బాలరాముడి విగ్రహానికి పవిత్ర జలాల తో మంగళకరమైన అభిషేకాలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందే చిత్రం రూపంలో బాలరాముడి దివ్య దర్శనం భక్తులకు లభించింది. ఈ సందర్భంగా సరయూ జలాలతో గర్భగుడిని శుద్ధి చేశారు. వాస్తుశాంతి, అన్నదివస్ కార్యక్రమాలు నిర్వహించారు. బాలరాముడి విగ్రహంపై అనేక అవతారాలు చెక్కారు. కుడివైపున కొన్ని …ఎడమవైపున మరికొన్ని ఉన్నాయి. కుడివైపున వామన అవతారం, నృసింహ అవతారం,వరాహ అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారంతో పాటు భక్త హనుమాన్ చిత్రం ఉంటుంది. ఇక ఎడమవైపున కొన్ని అవతారాలున్నాయి. ఎడమవైపున పర శురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారంతో పాటు గరుడుడు చిత్రం కూడా కనిపిస్తుంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ఓ దివ్యమైన ముహూర్తాన్ని ఎంపిక చేశారు వేద పండితులు.మొత్తం 84 సెకన్ల పాటు ఉండే ముహూర్తంలో అద్భుత శుభ గఢియలు ఉన్నాయని చెప్పారు వేద పండితులు. ఈ దివ్య ముహూ ర్తంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరగడం భారతదేశానికి శుభ పరిణామం అవుతుందన్నది పండితుల మాట.
ఇదిలా ఉంటే అయోధ్యా నగరంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయోధ్య నగరాన్ని ఏకంగా 12 వేలమంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకున్నారు అధికారులు. అంతేకాదు సైబర్ నిపుణులు కూడా అయోధ్య నగరానికి చేరుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కార్యకలాపాలను గుర్తించడానికి భద్రతా బలగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం ఇదే తొలిసారి. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అయోధ్యలో 10 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇంటిగ్రెటెడ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే భద్రత కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇతర రాష్ట్రాల ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారు. కాగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కూడా అంచెలంచెల తనిఖీలు చేశారు. భద్రతా ఏర్పాట్లు చెక్కు చెదరకుండా ఉండేందుకు గానూ…యాంటీ డ్రోన్ల టెక్నాలజీ కూడా ఉపయోగించారు.