వచ్చే లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా బీఆర్ఎస్ మలి విడత సమీక్ష సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందు లో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు.
తొలి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయి. సంక్రాంతి నేప థ్యంలో నాలుగు రోజుల విరామం ఇచ్చారు. ఇవాళ నాగర్కర్నూల్, రేపు మహబూబ్నగర్, ఈ నెల 19న మెదక్, 20న మల్కాజిగిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్, 22న నల్గొండ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి.
లోక్సభ నియోజకవర్గ సమీక్షలకు ఎంపీలతోపాటు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సుమారు 70-80 మంది చొప్పున వివిధ స్థాయుల నాయకులను కలిపి.. మొత్తం 500 మందిని ఆహ్వానిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు, ఓటమి అనంతర పరిస్థితులు, లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగనున్న ప్రత్యర్థులు, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాలు తదితర అంశాలపై లోతుగా చర్చిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ పూర్తయిన సమీక్షల సమాచారాన్ని పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 22న ఆఖరి సమీక్ష అనంతరం కేసీఆర్ నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై.. పార్లమెంటు ఎన్నికలకు కార్యాచరణ రూపొందిస్తారని తెలుస్తోంది.


