తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా జరుగుతున్నాయి. అధికార , విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీలో నిన్న సాగునీటిపై శ్వేతపత్రం విడుదల కావాల్సి ఉండగా.. జరగలేదు. అయితే సాగు నీటి శాఖపై శ్వేతపత్రం విడుదలకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ శాసనసభలో నీటిపారుదల శాఖపై శ్వేత పత్రాన్ని విడుదల చేసి, దానిపై లఘు చర్చను నిర్వహించ నుంది. కాళేశ్వరంలో అవినీతిని కడిగేస్తూ కాగ్ నివేదిక ఇవ్వడం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ లోపాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యం తర నివేదిక కూడా చేతికిరావడం, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసులు అందుబాటులో ఉండటం తో వాటినన్నింటినీ పొందుపరిచి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. నేడు శాసనసభలో మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 81,911 కోట్లతో చేపటిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని కాంపొనెంట్లనూ కాగ్ దాదాపు రెండేళ్ల పాటు వడపోసి కచ్చితమైన లెక్కలు తీసింది. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో అవే అంశాలు ప్రధానంగా ఉండే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.


