తెలంగాణ పోలీస్ శాఖ సంచలనం నిర్ణయం తీసుకోనుంది. కోట్లల్లో ఆర్థిక నేరాలు చేసే వారే టార్గెట్ గా లిస్టింగ్ చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వనుంది. దీంతో ఆర్థిక నేరస్థుల్లో గుబులు నెలకొంది.పోలీసుల తీసుకున్న నిర్ణయంతో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఆర్థిక మోసాలకు పాల్పడేవారు, అవినీతిపరులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అడ్డగోలుగా ఆర్జించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకునేలా సంబంధిత కేసులను ఈడీతోపాటు ఆదాయపన్ను శాఖకు రాష్ట్ర పోలీసులు సిఫార్సు చేయనున్నారు. అవినీతిపరులు, మోసాలకు పాల్పడుతున్నవారిపై నమోదవుతున్న కేసులు రకరకాల కారణాలతో ఏళ్ల తరబడి నడుస్తున్నాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. ఈడీ అయితే నిర్ణీత సమయంలో అక్రమ ఆస్తులను జప్తు చేస్తుందనే నమ్మకం ఉంది. ఐటీ శాఖ కూడా లెక్కల్లో చూపని ఆదాయం, ఆస్తులను గుర్తిస్తుంది. ఈడీ,ఐటి శాఖల కు రాష్ట్ర పోలీస్ శాఖ ఫైల్ ని ఇస్తే వీలైనంతవరకూ అక్రమార్కులకు కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో ఆయా విభాగాలను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల పట్టుబడి కస్టడీ విచారణలో ఉన్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును ఈడీకి, ఐటీ శాఖకు సిఫార్సు చేయనున్నారు. ఇకమీదట ఇలాంటి కేసులన్నీ ఆయా విభాగాలకు పంపనున్నారు.
మరో వైపు రాష్ట్రంలో ఆర్థిక మోసాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. 2022లో 21,499 చీటింగ్ కేసులు నమోదు కాగా మరుసటి ఏడాది అయినా 2023కి ఇవి 22,996కు పెరిగాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 16 వేల కోట్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. అంటే ప్రజలు అంత మొత్తంలో మోసపోయారో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మొత్తం 50 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచన వేస్తున్నారు. ఇందులో రకరకాల మోసాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పేరుతో జరిగే మోసాలకు కొదవేలేదు. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, పెట్టుబడికి అత్యధిక ఆదాయం ఇస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఇలా దాదాపు 36 రకాలుగా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అయితే హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలో కలిపి గత ఏడాది దాదాపు 10 వేల కోట్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ మోసాలు జరిగాయి. అధిక వడ్డీలకు ఆశపడి.. ఉద్యో గాలు ఇప్పిస్తామంటే నమ్మి.. మోసపోయిన చాలామంది కోట్లల్లో నష్టపోయారు. అక్రమార్జనకు అలవాటు పడిన వారు ఎంతోమందికి ఇలాంటి మోసాలు నిత్యకృత్యమైపోయాయి. కరక్కాయలు కరగదీసి ఇస్తే పెద్దమొత్తంలో డబ్బులిస్తామని చెబుతూ చేసిన మోసం తెలిసిందే.
ఆన్లైన్లో పంపిన సమాచారాన్ని పీడీఎఫ్గా మార్చిఇస్తే డబ్బు ఇస్తామని నమ్మిస్తూ రూ.వందల కోట్లు వసూలు చేస్తు న్నారు. ఇలా వసూలు చేసిన వాటిని రకరకాల మార్గాల్లో ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసినా నిందితులు కొద్దిరోజుల్లోనే బెయిల్ తీసుకొని దర్జాగా బయట తిరుగుతున్నారు.అయితే పోలీసులకు ఉండే పనిఒత్తిడి వల్ల ఇలాంటి కేసులు ఏళ్ల తరబడి దర్యాప్తులోనే ఉండిపోతున్నాయి. దీనివల్ల బాధితులకు ఊరట లభించడం లేదు. ఈ మేరకు పెద్దమొత్తంలో వసూలు చేసి మోసాలకు పాల్పడిన కేసుల వివరాలను ఈడీకి, ఐటీ శాఖకు పంపాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.
గతంలోనూ ఈడీ అధికారులు ఇలా కొన్ని కేసులు తీసుకున్నారు. వసూలు చేసిన డబ్బును ఇతర ఖాతాల్లోకి మళ్లిం చారని అనుమానించిన ప్రతి కేసునూ ఇకపై రాష్ట్ర పోలీసులు ఈడీకి సిఫార్సు చేయాలని భావిస్తున్నారు. తద్వారా మోస పూరితంగా ఆర్జించి, సమకూర్చుకున్న ఆస్తులను సత్వరమే జప్తు చేయాలనేదే అధికారుల లక్ష్యం. అలాగే ఐటీ శాఖ కూ వివరాలు ఇవ్వడం ద్వారా ఆయా సంస్థల నిర్వాహకులు నల్లధనాన్ని ఎలా వెనకేసుకుంటున్నారో వెలికి తీయనున్నా రు. అయితే అవినీతి కేసుల్లో పట్టుబడిన లిస్ట్ ను ఈడీ, ఐటీ శాఖలతో రాష్ట్ర పోలీస్ శాఖ పంచుకోనుంది. అవినీతిపరు లు ఆదాయానికి మించి ఆర్జించిన మొత్తంతో ఇతర ఆస్తులు కూడబెట్టుకోవడం ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల ను బినామీలుగా పెట్టుకొని వారి ఖాతాల్లోకి మళ్లించడం చేస్తున్నారు. ఇది కూడా పీఎంఎల్ఏ పరిధిలోకే వస్తుంది కాబట్టి ఇటువంటి అక్రమ ఆస్తులు కూడా గుర్తించి జప్తు చేయించనున్నారు. మొత్తానికి రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకోనున్న నిర్ణ యం పట్ల ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తనున్నాయి.