స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పొత్తులతో పాటు సీఎం పదవి గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో హత్యలేవీ ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీని ఓడించి ప్రజలకు అధికారం అప్పగించడం అంటే చంద్రబాబుకు అప్పగించడమేనా అని ప్రశ్నించారు. పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న జనసేన కార్యకర్తల ఆశలను అడియాశలు చేశారని పేర్కొన్నారు. నాయకుడనే వాడు ఎప్పుడూ రాజకీయాల్లో ఉండాలని.. పవన్ కల్యాణ్ లా అప్పుడప్పుడు జనాల్లోకి రారని ఎద్దేవా చేశారు.
ఇక మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే పవన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ పెట్టి సీఎం అవ్వడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కన్నంత ఈజీ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపలేనని పవన్ ఎట్టకేలకు చేతులు ఎత్తేశారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నామని.. ఇప్పుడు అదే నిజమైందన్నారు. సినిమా హీరోగా ఉండకుండా ఆయనకు రాజకీయాలు ఎందుకంటూ ఎద్దేవా చేశారు.