స్వతంత్ర వెబ్ డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్లు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఇవాళ ఆడుతున్నాయి. మార్చి తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్-16 బిజీలో గడిపిన ఇరు దేశాల క్రికెటర్లు ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు. రెండేళ్ల టెస్టు ఛాంపియన్షిప్ క్రతువు.. అంతిమ ఘట్టంలోకి అడుగు పెట్టేస్తోంది. ఈ రెండేళ్లు నిలకడగా రాణించి ఫైనల్ చేరిన భారత్, ఆస్ట్రేలియా టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానంలో బుధవారం(నేటి) నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు ప్రారంభం కాబోతుంది. మరి ఈ ట్రోఫీ ఎవరు అందుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఆసీస్ పేస్ బౌలర్లకు, భారత స్టార్ బ్యాటర్లకు పోరుగా ఈ మ్యాచ్ను అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. రెండేండ్లకోమారు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టాప్ – 2లో నిలిచిన టీమ్స్ తుదిపోరులో తలపడతాయి. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో.. వాళ్లకే టెస్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ దక్కొచ్చు. గత పర్యాయం కోహ్లి భారత జట్టును నడిపిస్తే.. ఈసారి రోహిత్ నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాకు పేసర్ కమిన్స్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ రెండేండ్లలో ఆస్ట్రేలియా 19 మ్యాచ్ లు ఆడి 11 గెలిచి మూడు ఓడి, ఐదింటిని డ్రా చేసుకుని 152 పాయింట్స్తో తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న టీమిండియా.. 18 టెస్టుల్లో పది గెలిచి ఐదు ఓడి మూడింటిని డ్రా చేసుకుని 127 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బ్యాటింగే అతిపెద్ద బలం. గడిచిన ఆరు నెలలుగా టీమిండియా యువ సంచలనం శుభ్మన్ గిల్తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు పరుగుల వరద పారిస్తున్నారు. ఐపీఎల్లో విఫలమైనా రోహిత్ శర్మ టెస్టులలో మంచి టచ్ లోనే కనిపిస్తున్నాడు. వికెట్ కీపర్గా ఇషాన్ – భరత్ల మధ్య ఎవరిని ఎంచుకుంటారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బ్యాటింగ్ బలంగా ఉన్నా టీమిండియాకు బౌలింగ్ కీలకం.. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా అది భారత్ బౌలర్ల మీదే ఆధారపడి ఉంది. డ్రై వికెట్ అయిన ఓవల్ మొదటి మూడు రోజులు బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ బౌన్సీ పిచ్ పై షమీ, సిరాజ్ లతో పాటు మూడో పేసర్ గా ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. శార్దూల్, ఉమేశ్ లలో ఎవరిని ఎంచుకుంటారనేదానిపై టీమిండియా పేస్ బలం ఆధారపడి ఉంది. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా-అశ్విన్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది.
డబ్ల్యూటీసీలో భాగంగా వరుస విజయాలతో ఆస్ట్రేలియా జోరుమీదుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఓడిపోయినా ఆసీస్ను మాత్రం మనం తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా కండిషన్స్కకు సరిపోయేలా ఉండటం కంగారూ జట్టకు కలిసొచ్చే అంశం. ఆ జట్టులో కూడా ప్రమాదకరమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ రూపంలో ఆ జట్టుకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ తో పాటు.. యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఉన్నాడు.
అయితే ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. వర్షం అంతరాయం కలిగిస్తే.. కోల్పోయిన సమయాన్ని మిగిలిన రోజులతో పాటు రిజర్వ్ డే (జూన్ 12)న ఆడిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోతే రిజర్వ్ డే రోజు ఆడిస్తారు. మ్యాచ్ ఐదో రోజు ముగిసేనాటికి మ్యాచ్ టై అయినా, డ్రా అయినా ఇరు జట్లనూ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ మ్యాచ్ భారత కాలమానం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.