ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరఫున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజా ప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంత మంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు. ఎంత మంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు. ఎంత మంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు. అసలు ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు.?
విశాఖ మహానగరం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయి ఉంది. ఇందులో తూర్పు నియోజకవర్గం కీలకమైనదని చెప్పవచ్చు. 15 వార్డులు, మూడున్నర లక్షల పైచిలుకు ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో గత మూడు పర్యాయాలు టీడీపీ జెండానే ఎగిరింది. వివాద రహితుడిగా పేరున్న వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే హ్యాట్రిక్ విజయాలు సాధించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లోనూ టీడీపీ తరపున పోటీ చేసిన వెలగపూడి.. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పై గెలిచారు. ఇక గత ఎన్నికలు అంటే 2019లో ముచ్చటగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా తూర్పు నుంచి పోటీ చేసిన వెలగపూడి వైసీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల పై గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
వివాద రహితుడిగా పేరుండడం, పిలవగానే స్పందించి సమస్యలు తీర్చే సానుకూల దృక్పథం వెలగపూడి రామకృష్ణకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సంపాదించారు. ముఖ్యంగా 2014 నుంచి తెలుగుదేశం అధికారంలో ఉన్న ఐదేళ్లలో.. వెలగపూడి తూర్పు నియోజక వర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధే చేశారని ఇక్కడి ప్రజలు అంటున్నారు. డ్రైనేజీ మరమ్మతులు, తాగునీటి సౌకర్యాలు, పార్కుల నిర్మాణాలు, పారిశుద్ధ్యం ఇలా అనేక అంశాల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేశారని చెబుతున్నారు.అయితే గత ఐదేళ్లు మాత్రం పరిస్థితి మరోలా మారింది. టీడీపీ తరఫున తాను ఎమ్మెల్యేగా గెలిచినా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని తూర్పు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. అందుకే గడచిన ఐదేళ్లలో వెలగపూడి పెద్దగా ప్రభావం చూపలేకపోయారని తెలుస్తోంది.
పిలిస్తే పలికే నాయకుడిగా వెలగపూడి రామకృష్ణ బాబుకు తూర్పు నియోజకవర్గంలో మంచిపేరే ఉంది. అయితే అదంతా 2019 కి ముందు. గత ఐదేళ్లలో ఆయన వైఖరిలో ఏ మార్పూ రాకపోయినా, నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం కుంటుపడిందని తూర్పు విశాఖ వాసులు చెబుతున్నారు. ఎమ్మెల్యే అంటే తన నియోజకవర్గంలో జరగాల్సిన పనుల గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలని, అవసరమైతే పోరాటాలు చేయాలని, ఆ విషయంలో వెలగపూడి కాస్త వెనకబడ్డారని స్థానికులు అంటున్నారు. తూర్పు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగినా, అది విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చలవేనని మరికొందరు అంటున్నారు. ఆమె స్థానికురాలు కావడం వల్ల జీవీఎంసీ నిధులు విడుదల చేసి ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు, కరెంట్ పనుల వంటివి చేయిం చారని చెబుతున్నారు. 2014 లో టీడీపీ సర్కారు హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కూడా ఆయన చేయలేకపోయారని స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు కొంచెం కష్టమై కావచ్చని అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం వెలగపూడికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనే ఈ నియోజ కవర్గాన్ని అభివృద్ధి చేశారని అంటున్నారు. గత ఐదేళ్లలో ఆయన పెద్దగా ప్రభావం చూపలేదంటే దానికి కారణం వైసీపీ సర్కారు కానీ.. ఆయన కాదని అంటు న్నారు. వైసీపీ పాలనలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను డమ్మీలను చేశారని.. దాని ఫలితంగానే పరిస్థితి ఇలా మారిందని అంటున్నారు. అందరికీ అనుకూలంగా ఉండే వెలగపూడి రామకృష్ణబాబే నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని కొందరు ధీమాగా చెబుతున్నారు.
ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుగా ఉండడంతో సమీకరణాలన్నీ వెలగపూడికి అనుకూలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే గత ఐదేళ్ల పాలన ఆధారంగా చూసుకుంటే మాత్రం వెలగపూడిపై ప్రజల్లో ఒకింత సానుకూల స్పందనే వస్తోంది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో ఆయన భవితవ్యం ఎలా ఉంటుందో.


