పట్టభద్రుల ఎన్నిక కాంగ్రెస్ను కలవరపెడుతోందా..? ఓటమి భయంతో టెన్షన్ పడుతోందా..? పట్టభ ద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయాస పడుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండి తులు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న హస్తం నేతలకు ఓటమి భయ మెందుకు..? కాంగ్రెస్లో కలవరానికి కారణమేంటి..?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయో లేదో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల మాదిరే ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేందుకు నువ్వా నేనా అన్న రేంజ్లో తలపడతున్నాయి ప్రధాన పార్టీలు. ఇందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేజిక్కిం చుకున్న కాంగ్రెస్ను మండలి ఎన్నికలు టెన్షన్ పెడతున్నాయి. మరీ ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పరుగులు పెట్టిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో నిలిపినప్పటికీ, ఆరుగురు ఉద్దండులైన మంత్రులు, డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ ఓటమి భయం పట్టుకుంది. దీంతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయాస పడుతోంది.
ఈనెల 27న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలను గెలిచేందుకు కాంగ్రెస్ అందరికన్నా ముందే అభ్యర్థిని ప్రకటించింది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలైన తీన్మార్ మల్లన్న బరిలో దించింది. గతంలో దాదాపు గెలిచినంత పనిచేసిన తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నా, ఆ మూడు జిల్లాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకున్నా కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న సందేహం నెలకొంది. దీంతో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం రేవంత్రెడ్డి వరుస సమీక్షలు నిర్వహి స్తున్నారు. కచ్చితంగా గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఖమ్మం, వరంగల్, నల్గగొండ పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 32 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే.. బీజేపీకి ఒక ఎమ్మెల్యే కూడా లేరు. మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అందరికీ తెలిసిన వ్యక్తి. కేసీఆర్ హయాంలో పట్టభద్రుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై జర్నలిస్టుగా పనిచేశారు. మరోపక్క కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 30 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. మరో లక్షా 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని భరోసా ఇస్తోంది. అయినప్పటికీ పట్టభద్రులు తమకే ఓటు వేస్తారు అన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్లో కనిపించడం లేదు. ఇందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం అవగాహనతో పని చేస్తున్నాయని హస్తం పార్టీ అనుమానిస్తోంది. బీఆర్ఎస్ రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థికి బీజేపీ రెండో ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి పడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో బీఆర్ఎస్ లేదా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ చాలా సీరియస్గా పరిగణిస్తోంది.
కాంగ్రెస్కు ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ 100 రోజుల పాలనపై పట్టభద్రులు, నిరుద్యోగులు, రైతులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వంద రోజుల్లోపు అమలు చేస్తామన్న హామీలు ఇంకా పూర్తి కాలేదు. ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగాల నోటిఫికేషన్, పోటీ పరీక్ష నిర్వహణ ఆలస్యమైంది. నిరుద్యోగుల విషయంలో 100 రోజుల్లో ఈ ప్రభుత్వం పెద్దగా మార్పు చూయించలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. పైగా ప్రవేశ పరీక్షల ఫీజును భారీగా పెంచింది. దీంతో ఈ అంశాలను బీఆర్ఎస్, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ ఓటర్ల మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్లో గెలుపు ధీమా కనిపించడం లేదు. అభ్యర్థితోపాటు ఎమ్మెల్యేలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన స్పీడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించడం లేదు. తమ పాలనకు రెఫరెంటమని లోక్సభ ఎన్నిక లను కాంగ్రెస్ ఎదుర్కొంది. కానీ అదే రిఫరెన్స్ అంశాన్ని ఈ మండలి, ఉప ఎన్నికల్లో కనీసం ప్రస్తావిం చడం లేదు. దీంతో మండలి ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్కు అనుమానాలు ఉన్నాయన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఓ వైపు లోలోపల టెన్షన్ పడుతునే మరోవైపు గెలిచి తీరుతామ న్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. తమ గెలుపు సునాయాసమని కేవలం మెజారిటీ కోసమే కష్టపడుతున్నామని కవర్ చేసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలుపును కాయం చేసుకునేందుకు సీరియస్ ప్రచారాన్ని చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటైనా కూడా గెలుపు తమదేనని ఢంకా బజాయించి చెబుతున్నారు. మరి ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుంది..? కాంగ్రెస్ అనుమానిస్తున్నట్టు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటిగా హస్తం అభ్యర్థిని దెబ్బ కొడతారా..? లేదంటే ప్రతిపక్ష పార్టీల కంటే ఎత్తుగడలు వేసి తామే గెలిచి తీరుతారా అన్నది ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాలి.