ఏడేడు లోకాలు ఏలే ఏడుకొండలవాడు దేవాది దేవుడు, దేవ దేవోత్తముడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సకల భువన రక్షకుడు. శ్రీమన్నారాయణుడి అవతారమైన ఆ శ్రీనివాసుడి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం అంటే .. భక్తులు స్వామి వారి అనుగ్రహంగానే భావిస్తారు. అయితే, శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ పదార్థాల నాణ్యతా పరీక్షలకు ల్యాబ్ లేకపోవడం శోచనీయం. ఇందుకోసం కేంద్ర సర్కారు 2022 లో ల్యాబ్ ఏర్పాటు కోసం 75 కోట్ల రూపాయల ప్రతిపాదనల్లో 25 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అయితే, అప్పటి టీటీడీ అధికారుల స్పందన కరువవ్వడంతో ల్యాబ్ ఏర్పాటు కాలేదు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది తిరుమల లడ్డు ప్రసాదం. తిరుమల లడ్డూ రుచిలో, రూపంలో, పుణ్యఫలాలు ఇవ్వడంలో అన్నింటా స్వామి వారి లడ్డూ ప్రసాదం నెంబర్ వన్ గానే ఉంటోంది. లడ్డూ ప్రసాదం అంటే సాక్షాత్ శ్రీవారి అనుగ్రహమే అని భక్తులు భావిస్తారు. అందుకే అతి పవిత్రంగా లడ్డూ ప్రసాదాన్ని భావించి కళ్లకద్దుకుని మరీ నోట్లో వేసుకుంటారు. దేశములో ఎన్నో దేవాలయాల ప్రసాదాల రుచితో పోల్చితే తిరుపతి లడ్డు రుచియే ప్రత్యేకమని భక్తులు వ్యాఖ్యానిస్తారు. 1803 నుంచి దేవస్టానంలో ప్రసాదాలను విక్రయాలు ప్రారంభమైనట్టు తిరుమల ఆలయ చరిత్ర చెబుతోంది. తొలుత బూంది ప్రసాదం అనంతరం లడ్డుగా మారింది. లడ్డు తయారీకి వాడాల్సిన సరుకుల మెతాదును దిట్టం అని పిలుస్తారు.
1950లో తొలిసారిగా టీటీడీ పాలకమండలి దీనిని రూపొందించింది. రోజుకురోజుకు పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని 2001 లో దిట్టాన్ని సవరించారు. దీనిని పడితరం దిట్టం స్కేలుగా పిలుస్తారు. 5100 లడ్డులు తయారు చేయడానికి ఆవు నెయ్యి 185 కిలోలు, శనగపిండి 200 కేజిలు, 400 కేజిల చెక్కెర, జీడిపప్పు 35 కేజిలు ఎండు ద్రాక్ష 18 కేజిలు, కలకండ 10 కేజిలు,, యాలకులు 5 కిలోలు వినియోగిస్తారు. మొత్తము మీద 5,100 లడ్డూల తయారీకి 852 కేజిల సరుకులను వాడతారు. తిరుమలో రోజువారీ సగటున 3 లక్షలపైబడే లడ్డలూ తయారుచేస్తారు. ఉత్సవాల సందర్బముగా ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటి తయారీ కొసం రోజుకు సగటున 12 నుంచి 15 వేల కిలోల నెయ్యిని వినియోగిస్తారు.
ప్రతి ఆరు నెలలకోసారి టెండర్ ద్వారా నాణ్యమైన ఆవునెయ్యిని మంచి పేరున్న డెయిరీల నుంచి కోనుగోలు చేయాలనే రూలుంది. అయితే, లడ్డూ తయారీకి అవసరమైన సరుకుల నాణ్యతను పరీక్షించేందుకు అవసరమైన సొంత ల్యాబ్ ను టీటీడీ ఏర్పాటు చేసుకోలేకపోయింది. 2019_24 సంవత్సరాల మధ్యలో అప్పటి కేంద్ర సర్కారు ఈ అంశంపై దృష్టి సారించింది. ల్యాబ్ ఏర్పాటు కోసం 75 కోట్ల రూపాయల ప్రతిపాదనల్లో 25 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు సమాచారం. నిధులు మంజూరు చేశాక, ఇందుకు సంబంధించి తిరుమలలో ల్యాబ్ నిర్మించుకోవాలని కేంద్రం టీటీడీని కోరింది.
అయితే, నాడు ల్యాబ్ ఏర్పాటుకు అధికారులు చొరవ చూపించకపోవడవంతో, నిధులు తిరిగి కేంద్రానికి వెళ్లిపోయినట్టు తెలిసింది. నాడు ల్యాబ్ ఏర్పాటై ఉంటే లక్షల కిలోల నెయ్యిని పరీక్షించేందుకు అవకాశం ఉండేదని తెలుస్తోంది. ప్రతి 6 నెలలకు 30 లక్షల కేజిల ఆవు నెయ్యిని టీటీడీ వివిధ డైయిరీల నుంచి ని కొనుగోలు చేస్తోంది. నాడు అధికారులు ఎందుకు ల్యాబ్ ఏర్పాటుకు స్పంధించలేదన్న విషయంపై సిట్ అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా సిట్ అధికారులు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
————