స్వతంత్ర వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా దేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోందని.. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్ణాటకలో మోదీ గల్లీ గల్లీ ప్రచారం చేసినా బీజేపీ ని అక్కడి ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ వైఖరి ఎంటో స్పష్టం చేయాలని అన్నారు.
“మణిపూర్ అంశం చర్చకు వచ్చినా.. పార్లమెంట్లో చర్చించకుండా ఇతర అంశాలతో ప్రజలను పక్కదారి పట్టించారు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు నివేదికలు ఇచ్చాయి. సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్కు 38 శాతం, బీఆర్ఎస్కు 31 శాతం మాత్రమే అవకాశం ఉందని సర్వేలు చెప్పాయి. బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి ఎదురవుతుందనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇండియా కూటమి వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానానికి వ్యతిరేకం. అందుకే అధీర్ రంజన్ కమిటీ నుంచి వైదొలిగారు.
2018లో కేసీఆర్ జమిలి ఎన్నికలకు అనుకూలమని కేంద్రానికి లేఖ రాశారు. ఎలక్షన్ కోడ్తో రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకమని కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు. ఆ లేఖను బి.వినోద్ కుమార్కు ఇచ్చి చౌహన్ గారికి పంపించారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్న కేసీఆర్.. మీ బీఆర్ఎస్ వైఖరి ఏమిటి..? బీజేపీ విధానాలకు మీరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టే కదా..? జమిలి బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం. మన దేశం రాష్ట్రాల సమూహం. ఒక పార్టీ చేతిలో అధికారం పెట్టుకోవడానికి బీజేపీ కుట్ర చేస్తుంది. ఈ కుట్రను నేను ముందుగానే ఊహించి లోక్ సభలో ప్రస్తావించా.. బీజేపీది వన్ నేషన్ వన్ పార్టీ విధానం అని నేను చెప్పా. బీజేపీ తెచ్చిన ప్రతీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు.. అవి ఒకే తాను ముక్కలు..” అని రేవంత్ రెడ్డి అన్నారు.