ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బోర్డు వివాదాలకు అడ్డాగా ఎందుకు మారుతుంది..? కుక్కిన పేనులా ఉండాల్సిన పరిస్థితి బోర్డు సభ్యులకు ఎందుకొచ్చింది..? అసలు క్రీడాల్లో రాజకీయ నేతల పెత్తనం ఏంటి..? ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడనన్న హనుమ విహారి మాటలకు కారకులు ఎవరు..?
టీమిండియా బ్యాటర్, తెలుగు క్రికెటర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రా క్రికెట్ జట్టును వీడనున్నట్లు స్పష్టం చేశారు. రంజీ ట్రోఫీ 2023-2024 క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి.. టోర్నీ నుంచి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమ విహారి తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని.. ఇకపై ఆ జట్టు తరఫున ఆడబోనని తేల్చి చెప్పాడు. ఫిబ్రవరి 26న తన సోషల్ మీడియా ఖాతాలో విహారి ఓ పోస్ట్ కూడా పెట్టాడు. టైటిల్ కోసం తామెంతో పోరాడమని..ఆంధ్రా జట్టు తరఫున మరో క్వార్టర్స్ ఓడిపోవడం చాలా బాధగా ఉందన్నారు. రంజీ 2023-2024 సీజన్లో భాగంగా బెంగాల్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్కు తాను కెప్టెన్గా ఉన్నానని చెప్పుకొచ్చారు. మ్యాచ్ సమయంలో 17వ ఆటగాడిపై అరిచానని…దీంతో తనపై కోపంతో ఆ ఆటగాడు రాజకీయ నేత అయిన అతడి తండ్రికి ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. ఆ రాజకీయ నేత తనపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్పై ఒత్తిడి తెచ్చాడని… ఫలితంగా తప్పు లేకున్నా కెప్టెన్గా వైదొలగమన్నారని హనుమ విహారి తెలిపారు.
వాస్తవానికి తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ఏమీ అనలేదని కానీ, అవేవీ పట్టించుకోకుండా అసోసియేషన్ మాత్రం తనపై చర్యలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు విహారి. జట్టు కోసం శక్తినంతా కూడగట్టుకుని, ఓ పక్క గాయం వేధిస్తున్నా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేశానని తన బాధను వెల్లగక్కారు. ఆంధ్రా జట్టును 5 సార్లు నాకౌట్ దశకు తీసుకెళ్లానని తెలిపారు. టీమిండియా తరఫున 16 టెస్టులు ఆడానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు. హనుమ విహారి ఒక తెలివైన అంతర్జాతీయ క్రికెటర్ అని.. ఆయన ఏపీ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రమాణ చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డారని దుయ్యబట్టారు. ఈ అన్యాయమైన చర్యలు ఏపీ ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవని చెప్పారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు భారత క్రికెటర్ కంటే..వైసీపీ నాయకుడే ముఖ్యమా అని నిలదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గాయాలను లెక్క చేయకుండా భారత జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఏపీ జట్టు కోసం హనుమ విహారి…తన క్రీడా శక్తినంతటనీ ధారపోశారని కొనియాడారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సైతం తీవ్రంగా స్పందించారు. అన్నింటిలోనూ నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలు..ఇప్పుడు క్రీడలపైనా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ గౌరవాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎంత దిగజారిపోతారో ఊహించలేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వ్యవహారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. క్రీడా రంగం పై రాజకీయ నాయకుల పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు. ఎన్నికల వేళ ఈ వివాదం ఏటు దారి తీస్తుందో చూడాలి మరి.


