తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలామంది సినిమా హీరోయిన్లు వస్తారు, వెళతారు? కొందరు స్టార్ హీరోయిన్లుగా చెలామణీ అవుతారు. కానీ ఎవరూ కూడా నటీమణులుగా కీర్తి పొందరు. కేవలం కథానాయికల్లా మాత్రమే మిగిలిపోతారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో తనకంటూ ఒక స్టయిిల్, ఇమేజ్ ని సొంతం చేసుకుని, అందుకు తగినట్టుగా పాత్ర పోషించి, అది చరిత్రలో నిలిచిపోయేలా నటించేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో జమున కూడా ఒకరని చెప్పాలి. ఆరోజుల్లో సావిత్రి, భానుమతి లాంటి ఎందరో మహానటీమణులు ఉన్నకాలంలో ఇండస్ట్రీకి వచ్చి వారికి ధీటుగా నటించి మెప్పించిన నటి ఎవరంటే జమున ముందు వరుసలో ఉంటారు.
తను అందమైన హీరోయిన్ మాత్రమే కాదు…అందంతో పాటు నటనతో కూడా మెప్పించిన అతి తక్కువ నటీమణుల్లో జమున పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. తను ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల వివాదాలకు తక్కువేం లేవు. కాకపోతే అదే తనకి ఆభరణం అని కూడా చెప్పాలి.

ఒక పాత్రని ఎంత గొప్పగా పోషించాలి (సత్యభామ) ?
ఎంత అమాయకంగా చేయాలి ( అప్పు చేసి పప్పు కూడులో చెల్లెలి పాత్ర) ?
ఎంత మొండిఘటంగా చేయాలి (గుండమ్మ కథ)
ఎంత అల్లరి పిల్లగా చేయాలి ( మిస్సమ్మ)
త్యాగమూర్తి పాత్ర చేయాలంటే (మురళీ కృష్ణ)
అందాల నటి అని ఎందుకంటారంటే ( ‘అందాల ఓ చిలుకా’ హరనాథ్ తో పాట చూడాల్సిందే)
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల పాత్రలు… ప్రతీ పాత్రకు జీవం పోసి, తన మార్కు నటన, హావభావాలతో నటించి కొత్త నటీనటులకు ఒక సిలబస్ గా చూపించిన నటి ఒక్క జమున అని మాత్రమే చెప్పాలి.

ఎంత చెప్పినా ఒక సినిమా గురించి చెప్పకపోతే తక్కువే అవుతుంది. ‘‘బంగారు తల్లి’’ సినిమా అందుకు ఉదాహరణ…మదర్ ఇండియా సినిమా స్ఫూర్తితో తెలుగులో తీసిన సినిమా అంది. శోభన్ బాబు, కృష్ణంరాజు నటించారు. ఒక పదహారేళ్ల వయసు నుంచి జమున పాత్ర మొదలై, అలా పండు ముదుసలి వరకు సినిమాలో నడుస్తుంది. అలా అన్ని వయసులను సినిమాలో చూపిస్తారు. అవన్నీ సమర్థవంతంగా పోషించి శభాష్ అనిపించుకుంది.
ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ భాషా సినిమాల్లో నటించింది. మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, సంసారం, రాము, పూజా ఫలం, లేత మనసులు, గుండమ్మ కథ, రాముడు-భీముడు, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, తోడు-నీడ, ఉండమ్మా బొట్టు పెడతా, ఇలా ఎన్నో వందల సినిమాలు…వీటిలో చాలావరకు సూపర్ హిట్ అని చెప్పాలి. చాలా సినిమాలు రజతోత్సవాలు చేసుకున్నాయి.

ఎన్టీఆర్ తో విభేదాలు అలా కొనసాగుతూనే వచ్చాయి. తను రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1964లో విడుదలైన మూగ మనసులు, 1967లో హిందీ మిలన్ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
1937లో కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జమున జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆమె బాల్యంలోనే కుటుంబమంతా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వచ్చింది. జమున అసలు పేరు ‘జనాభాయి’. జాతక రీత్యా నది పేరు పెట్టాలని పండితులు చెప్పడంతో ఆమె పేరు మధ్యలో ‘ము’ చేర్చారు. అలా జమునగా అశేష తెలుగు ప్రేక్షకుల ముందు నిలిచారు.

1965లో జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10న ఆయన గుండెపోటుతో మరణించారు. వారిద్దరి పిల్లలైన కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె స్రవంతి లతో కలిసి జమున హైదరాబాద్ లో ఉంటున్నారు.