స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాని ప్రతీ దానిని కాషాయీకరిస్తున్నారు. భారతదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న జీ20 సమావేశాల లోగోను తమ పార్టీ జెండాలో ఉండే కలర్లతో రూపొందించారు. కమలం పువ్వు, కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో జీ20 సమ్మిట్ లోగో మనకు దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ రైళ్ల వంతు వచ్చింది. ఇండియన్ రైల్వేస్ తయారు చేస్తున్న వందే భారత్ రైళ్లను కాషాయీకరిస్తున్నారు. ఇప్పటివరకు అవి తెలుపు, నీలం రంగులో ఉండేవి. అయితే తెలుపు రంగులో ఉన్న రైళ్లను శుభ్రం చేసేప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయనే సాకు చూపి.. ఆ రైళ్ల కలర్ను కాషాయంలోకి మారుస్తున్నారు. డోర్లకు నలుపు రంగులు అద్దుతున్నారు.
అయితే వందే భారత్ రైళ్ల రంగు విషయంలో తాము జాతీయ జెండాను స్ఫూర్తిగా తీసుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. తన ట్విట్టర్ హాండిల్లో రంగులు మారిన రైలు ఫొటోలను ఉంచారు. ఇప్పటివరకు 25కుపైగా మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఇకపై వందే భారత్ రైళ్లలో కాషాయం రంగు ప్రముఖంగా కనిపించనుంది. పక్కనుంచి చూస్తే నలుపు, కాషాయం రంగులు కనిపిస్తాయి. వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ని ఆయన సందర్శించారు.